Mohan Bhagwat Statement on on PoK : అసలే భారత్, పాక్ నేతలు, ఆర్మీ అధికారుల మధ్య పీఓకే, ఉగ్రవాదం అంశాలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధినేత మోహన్ భాగవత్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ని భారత్లోని ఒక గదిగా అభివర్ణించారు. మా ఇంట్లోని గదిని ఇతరులు ఆక్రమించారు. ఆ గది భారత్లోని భాగమని, త్వరలోనే దానిని తిరిగి పొందుతామని అన్నారు. సత్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భాగవత్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ చీఫ్ మాటలకు అక్కడి ప్రజలు చప్పట్లు కొట్టారు.
భాగవత్ ఏం కామెంట్స్ చేశారు..
RSS చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. ఇక్కడ చాలా మంది సింధీ సోదరులు కూర్చున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వారు పాకిస్తాన్కు వెళ్ళలేదు, వారు అవిభాజ్య భారతదేశానికి చెందినవారు. పరిస్థితులు మమ్మల్ని ఈ ఇంటికి పంపించాయి. కానీ ఆ ఇల్లు, ఈ ఇల్లు వేర్వేరు కాదు. మొత్తం భారతదేశం ఒకే ఇల్లు లాంటిది. కానీ మన ఇంటిలోని ఒక గదిని ఒకరు ఆక్రమించారు. అక్కడ నా టేబుల్, కుర్చీ, బట్టలు ఉన్నాయి. ఇప్పుడు సమయం వచ్చింది. మనం మన గదిని తిరిగి సొంతం చేసుకోవాలని అన్నారు.
PoK లో నిరసనలు
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ప్రజలు పాకిస్తాన్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టిన సమయంలో మోహన్ భాగవత్ ఈ ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా వేలాది మంది స్థానికులు అవామీ యాక్షన్ కమిటీ (AAC) బ్యానర్ తో రోడ్లపైకి వచ్చి ఆర్థిక సహాయం కోసం, రాజకీయ సంస్కరణల కోసం డిమాండ్ చేస్తున్నారు. అక్కడ 3 రోజుల నిరసనల్లో ఇప్పటివరకు 10 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ధీర్కోట్ (బాగ్ జిల్లా) లో నలుగురు నిరసనకారులను పాకిస్తాన్ బలగాలు కాల్చి చంపాయి. ముజఫరాబాద్, దయాల్ (మీర్పూర్), చమ్యాతి (కోహాలా సమీపంలో) కూడా హింసకు దారితీసింది.
ప్రపంచానికి తన ధైర్యాన్ని, ఐక్యతను చూపించిన భారత్అంతకుముందు గురువారం నాడు మోహన్ భగవత్ భద్రతా సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిపై అంతర్జాతీయ స్పందన భారతదేశానికి నిజమైన మిత్రులు ఎవరో చూపించిందని ఆయన అన్నారు. 'ప్రపంచ వేదికపై ఎవరు మనతో ఉన్నారు, ఎంతవరకు మద్దతు ఇస్తారనేది ఒక పరీక్ష లాంటిది. భారతదేశ రాజకీయ నాయకత్వం, సైన్యం చూపించిన సాహసం.. దేశ ఐక్యత, నాయకత్వం ధైర్యం, సైన్యం శౌర్యాన్ని ప్రపంచానికి నిరూపించింది' అన్నారు.