Just In





Rahul Gandhi Fined Rs 200 By Court: రాహుల్ గాంధీకి 200 రూపాయల జరిమానా- కోర్టుకు హాజరుకానందుకు శిక్ష
Rahul Gandhi Fined Rs 200 By Court: సావర్కర్ బ్రిటిష్ ఏజెంట్ అన్నందుకు రాహుల్ గాంధీకి ఉత్తర్ప్రదేశ్ కోర్టు 200 రూపాయల జరిమానా విధించింది.

Rahul Gandhi Fined Rs 200 By Court: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి లక్నోలోని కోర్టు ₹200 జరిమానా విధించింది. వినాయక్ దామోదర్ సావర్కర్పై చేసిన "అభ్యంతరకరమైన" కామెంట్స్పై కేసులో కోర్టుకు రానందుకు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ చర్య తీసుకుంది.
ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కావాలని రాహుల్ గాంధీని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కాకపోతే, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.
Also Read: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చెమటలు పట్టిస్తున్న మీనాక్షి నటరాజన్
రాహుల్ గాంధీ ఏమన్నారంటే?
రాహుల్ గాంధీ అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో వీర్ సావర్కర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వినాయక్ సావర్కర్ను బ్రిటిష్ సేవకుడని, పెన్షనర్ అని ఆయన అభివర్ణించారు. రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటనకు వ్యతిరేకంగా పిటిషనర్ నృపేంద్ర పాండే అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తరపున న్యాయవాది ప్రన్షు అగర్వాల్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని అప్పీల్ చేశారు. విచారణ లక్నోలోని ACJM కోర్టులో జరిగింది.
రాహుల్ గాంధీకి పదే పదే సమన్లు జారీ చేసినప్పటికీ హాజరు కాలేదని న్యాయవాది నృపేంద్ర పాండే కోర్టుకు తెలిపారు. కోర్టు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాహుల్ గాంధీని సమర్థిస్తూ, ప్రాన్షు అగర్వాల్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారని, ఢిల్లీలో ముఖ్యమైన సమావేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీనితో పాటు, ఆయన అనేక కార్యక్రమాలకు వెళ్లాల్సి వస్తోందని కూడా తెలిపారు. "బిజీ షెడ్యూల్ కారణంగానే రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కాలేకపోయారు" అని అగర్వాల్ అన్నారు. రాహుల్ గాంధీ కోర్టును గౌరవిస్తారని, బెంచ్ ముందు హాజరు కాకపోవడం ఉద్దేశపూర్వకంగా జరిగిందని అగర్వాల్ అన్నారు.
ఈ కామెంట్స్ విన్న కోర్టు ప్రస్తుతానికి 200 రూపాయల జరిమానా విధిస్తున్నట్టు చెప్పింది. ఏప్రిల్ 14న జరిగే విచారణకు కచ్చితంగా రావాల్సి ఉంటుందని రాహుల్ తరఫున న్యాయవాదికి తేల్చి చెప్పింది.
Also Read: కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్