Underground Tunnel in Pune Ashram: పూణే నగర శివార్లలో వెలుగుచూసిన ఒక నకిలీ బాబా రాసలీలల ఉదంతం   పెను సంచలనం సృష్టిస్తోంది. వాఘోలిలోని ఉబాలేనగర్‌లో ఆశ్రమం పేరిట ఒక బంగ్లాను నడుపుతూ, మహిళలను మోసం చేస్తున్న  సెల్ఫ్ స్టైల్డ్ గురు  మిశ్రా ,  అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ బాబా గుట్టు రట్టు చేసిన పూణే పోలీసులు, ఆశ్రమం నుండి భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.    ఆశ్రమంపై 200 మంది పోలీసుల మెరుపు దాడి 

Continues below advertisement

పూణే నగరానికి చెందిన ఒక 41 ఏళ్ల విద్యావంతురాలైన మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. హర్యానాకు చెందిన మిశ్రా అనే వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా పూణేలో స్థిరపడి, ఉబాలేనగర్‌లోని ఒక విలాసవంతమైన బంగ్లాలో ఆశ్రమం నడుపుతున్నాడు. కుటుంబ సమస్యలు, అనారోగ్యం,  ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తానంటూ ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుకున్న మహిళలను ఈయన ట్రాప్ చేసేవాడు. ఆపై వారిని లోబరుచుకుని లైంగికంగా వేధించేవాడు. బాధిత మహిళ మంగళవారం రాత్రి పోలీసులను ఆశ్రయించడంతో, బుధవారం తెల్లవారుజామునే ఏకంగా 200 మంది పోలీసుల బృందం ఈ ఆశ్రమంపై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో నకిలీ బాబా మిశ్రాతో పాటు అతని ఆరుగురు మహిళా శిష్యులను, మొత్తం ఏడుగురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.

 రహస్య సొరంగం ద్వారా పారిపోయే ప్లాన్ 

Continues below advertisement

పోలీసుల సోదాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఏదైనా ప్రమాదం లేదా పోలీసుల దాడులు జరిగినప్పుడు ఆశ్రమం నుండి సులభంగా తప్పించుకోవడానికి బాబా మిశ్రా బంగ్లా కింద ఒక  అండర్‌గ్రౌండ్ టన్నెల్  నిర్మిస్తున్నాడు. ఈ సొరంగం పనులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే, తప్పులు చేస్తూ ఎప్పటికైనా దొరికిపోతామనే భయంతోనే ఈ నకిలీ గురువు ముందే పక్కా ఎస్కేప్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడని స్పష్టమవుతోంది.

 భారీగా డిజిటల్ డివైజ్‌లు, బుల్లెట్లు స్వాధీనం 

ఆశ్రమం బంగ్లాలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు,  డిజిటల్ స్టోరేజ్ పరికరాలు దొరికాయి. పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో  19 హార్డ్ డిస్క్‌లు, 12 ల్యాప్‌టాప్‌లు, ఒక టాబ్లెట్, 11 సెల్‌ఫోన్లు, 23 పెన్ డ్రైవ్‌లతో పాటు పెద్ద సంఖ్యలో డీవీడీలు, సీడీలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 6.5 లక్షల నగదు,  10 లైవ్ బుల్లెట్లను  స్వాధీనం చేసుకున్నారు. అయితే బంగ్లాలో ఎలాంటి తుపాకులు లభించకపోవడంతో ఆ బుల్లెట్లు ఎక్కడివనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

 బట్టబయలు కానున్న వైరల్ క్లిప్స్ 

స్వాధీనం చేసుకున్న ఈ ఎలక్ట్రానిక్ పరికరాలలో బాబా మిశ్రా బాధితులను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఉపయోగించిన వీడియోలు, ఫోటోలు ఉండే అవకాశాలు ఉన్నాయని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. అడిషనల్ కమిషనర్  తేజస్వి సాత్పుతే, డిప్యూటీ కమిషనర్ గౌహర్ హసన్  ఈ పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లలో బాబా చేసిన నేరాలకు సంబంధించిన బలమైన సాక్ష్యాలు దొరుకుతాయని భావిస్తున్నాం. ఒకవేళ అందులో మహిళలకు సంబంధించిన ఆసభ్యకర క్లిప్‌లు దొరికితే, వాటి ఆధారంగా బాధితులను గుర్తించి వారికి న్యాయం చేస్తాం" అని తెలిపారు. ఈ డివైజ్‌లన్నింటినీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు  పంపనున్నట్లు ప్రకటించారు.  

 బాధితులు ధైర్యంగా ముందుకు రావాలని పోలీసుల పిలుపు 

బాబా మిశ్రా కేవలం ఒకరిద్దరిని కాకుండా, వందలాది మంది మహిళలను లైంగికంగా వేధించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలా మంది మహిళలు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారని, అలాంటి వారంతా ధైర్యంగా ముందుకు వచ్చి స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. బాధితుల వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.