Priyanka Gandhi: హిమాచల్ ప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శిస్తున్న కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ.. హిమాచల్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆగస్టు 14వ తేదీన కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి చెందిన సిమ్లా సమ్మర్ హిల్ లోని శివాలయాన్ని సందర్శించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు.. ఇతర రాష్ట్ర మంత్రులతో కలిసి శివాలయాన్ని సందర్శించిన ప్రియాంక.. పరిస్థితిని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.


హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితి చాలా భీతావహంగా ఉందని, స్థానికుల పరిస్థితి చాలా బాధాకరమని, వారు తీవ్ర నష్టాన్ని చవిచూశారని ప్రియాంక గాంధీ అన్నారు. అందరూ కలిసి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 


'కేంద్ర ప్రభుత్వ హిమాచల్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటిస్తే.. అది రాష్ట్రానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను చూస్తుంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొన్న విధ్వంసం ఎంత ఉందో అర్థం కావడం లేదు' అని ప్రియాంక గాంధీ అన్నారు. 


జులై 14, 15 తేదీల్లో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియాలు విరిగిపడ్డాయి. కులు, మండి జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి విపత్తు విధ్వంసం సృష్టించాయి. జూన్ 24వ తేదీన ప్రారంభమైన రుతుపవనాల ప్రభావంతో సెప్టెంబర్ 11వ తేదీ వరకు రాష్ట్రంలో రూ.8,679 కోట్ల నష్టం వాటిల్లింది. అంతే కాకుండా.. హిమాచల్ ప్రదేశ్ లో వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగి పడటం వల్ల ఏకంగా 426 మంది ప్రాణాలు కోల్పోయారు. 39 మంది గల్లంతయ్యారు. 2,575 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మరో 11 వేల నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో రూ. 12 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు తెలిపారు. 


ఇలాంటి తీవ్ర విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారని, ఒకరికి ఒకరు తోడుగా నీడగా ఉన్నారని ప్రియాంక గాంధీ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు నష్ట పరిహారం ఇవ్వడం మొదలు పెట్టినట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ఎదుర్కొన్న ఈ సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటిస్తే.. రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేసినవారు అవుతారని ప్రియాంక గాంధీ అన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ ప్రతిభా సింగ్ కోరారు.


ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అజెండా ఏంటో ఎవరికీ తెలియదని, అయినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ సంక్షోభం గురించి చర్చించి దానిని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని, రాష్ట్ర ప్రజలకు సహాయం చేస్తారనని ప్రియాంక గాంధీ కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తామన్నారు.