Prime Minister Modi: నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (జూలై 24, 2026) క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కీలక సమావేశంలో, ప్రధాని మోదీ క్యాబినెట్ మంత్రులతో పలు అంశాలపై చర్చించారు. విద్యార్థులతో మమేకమవ్వడం, వారితో టచ్‌లో ఉండటం చాలా అవసరం, ఈ విషయంలో ప్రధాని మోదీ మంత్రులకు సలహాలు కూడా ఇచ్చారు.

Continues below advertisement

కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ మంత్రులకు ఏ సలహా ఇచ్చారు ?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రులను ఊహించని ప్రశ్న అడిగారు. ప్రభుత్వంలోని ఎంతమంది మంత్రులు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చురుకుగా ఉన్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో యాక్టివ్‌నెస్‌ పెంచుకోవాలని ఆయన మంత్రులకు సూచించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నేటి యువత సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫామ్‌లపై చాలా యాక్టివ్‌గా ఉంటున్నారని, కాబట్టి మంత్రులందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అంతే యాక్టివ్‌గా ఉండాలని ప్రధానమంత్రి క్యాబినెట్ మంత్రులకు సలహా ఇచ్చారు. మంత్రులు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు, యువతకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేయాలని షేర్ చేయాలి. యువతకు మరింత చేరువయ్యేందుకు తాను మొన్న (గురువారం, జూలై 23, 2026) రూపొందించిన ఒక వీడియో గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. 

Continues below advertisement

ప్రధాని మోదీ మంత్రులను ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉండమని ఎందుకు కోరారు ?

నిజానికి, నీట్ పరీక్ష పేపర్ లీక్ తర్వాత, ప్రభావిత విద్యార్థులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ క్రియేట్‌ చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు. ఈలోగా, సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP)కి, జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలకు వివిధ వర్గాల నుంచి మద్దతు రావడం జరిగింది. యువత, విద్యార్థులు నిరసనలపై, ప్రభుత్వ చర్యలకు, ఢిల్లీ పోలీసుల కాల్పులకు సంబంధించిన రీల్స్‌ను పోస్ట్ చేయడం, షేర్ చేయడం చేస్తున్నారు. ఇది మరింత మంది విద్యార్థులను ప్రేరేపిస్తోంది. ఈ ధోరణి గమనించిన ప్రధాని మోదీ క్యాబినెట్ సమావేశంలో తన మంత్రులకు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉండాలని సూచించారు.

ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రీల్స్ చేసి పథకాలు, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల గురించి ప్రమోట్ చేయాలని చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఒకసారి ఇలాంటి క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు యువతలో ఆవేశాలు చూసిన మోదీ మరోసారి మంత్రులకు ఇలాంటి సూచనలు చేశారు. ఆయన సూచనలు చేయడమే కాకుండా రెండు రోజుల నుంచి నేరుగా యూత్‌తో మాట్లాడుతున్నట్టు వీడియోలు పోస్టు చేస్తున్నారు.