Karnataka Rain Videos: కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం కురిసిన అకాల వర్షాలు ఎండల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనాన్ని కలిగించాయి. రాజధాని బెంగళూరులోని సంజయ్‌నగర్, యలహంక, దేవనహళ్లి వంటి ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల కొద్దిసేపు వడగళ్ల వాన కురిసి రోడ్లను కాశ్మీర్‌లా తెల్లగా మార్చేసింది. కర్ణాటక రోడ్లు చూసిన నెటిజన్లు కాశ్మీర్‌ను తలపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. కోణనకుంటె, కనకపుర రోడ్, ఆర్‌ఆర్ నగర్, సిబిడి పరిసరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు

ఈ అకాల వర్షం కారణంగా బెంగళూరులో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. బెంగళూరు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 1.3°C మేర తగ్గి 32.3°Cకి చేరుకోగా, హెచ్‌ఏఎల్ విమానాశ్రయం వద్ద 32°Cగా నమోదైంది. హెచ్‌ఏఎల్ (HAL) విమానాశ్రయం వద్ద 1.2°C తగ్గి 32°Cకి చేరుకుంది. జీబీఏ (GBA) విపత్తు నిర్వహణ బృందం ప్రజలకు సహాయం కోసం హెల్ప్‌లైన్ 1533 లేదా వాట్సాప్ నంబర్ 94806 85700ను సంప్రదించాలని కోరింది.

వాతావరణంలో వచ్చిన ఈ మార్పుతో నగరవాసులు చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సహాయక చర్యల కోసం విపత్తు నిర్వహణ బృందం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం కూడా బెంగళూరు పరిసర ప్రాంతాలతో పాటు మైసూర్, మాండ్య, హాసన్ వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేసింది.

ధార్వాడ్ జిల్లా కల్ఘట్గి తాలూకాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కల్ఘట్గి-ముండగోడ్ హైవేపై వడగళ్లు కుప్పలుగా పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మాచాపూర్, బేతదూర్ గ్రామాల్లో రోడ్లు, పొలాలు, ఇంటి పైకప్పులు మంచు కురిసినట్లుగా వడగళ్లతో నిండిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ అరుదైన దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తూ, వడగళ్లను సేకరిస్తూ సందడి చేశారు. ఈ వర్షాలు వేసవి తాపం తగ్గించినప్పటికీ, కొన్ని చోట్ల పంట పొలాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

నేడు (మార్చి 18న) బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, రామనగర, తుమకూరు, మాండ్య, చిక్కమగళూరు, శివమొగ్గ, హసన్, కొడగు, దావణగెరె, మైసూర్, చామరాజనగర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఐఎమ్‌డీ (IMD) అంచనా వేసింది.