Poonch Terror Attack: జమ్ము కశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కు పేలి ఐదుగురు సైనికులు సజీవదహనం అయ్యారు. అయితే ఈ ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు సైన్యం నిర్ధారించింది. పిడుగు పాటు వల్లే ట్రక్కులో మంటలు చెలరేగి ఉంటాయని ముందుగా భావించారు. కానీ దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ ఆరా తీశారు. దీంతో విషాధం వెనుక ఉన్న ఉగ్ర కుట్రలు వెలుగులోకి వచ్చాయి. బింభేర్ గలి నుంచి పూంఛ్ జిల్లాలోని సాంగియోట్ వైపు వెళ్తుండగా.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు మరణించారు. భారీ వానలు, సరిగ్గా కనిపించకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్న గుర్తు తెలియని ఉగ్రవాదులు భారత సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్లతో మెరుపుదాడికి దిగారని సైనిక అధికారులు వివరించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సైనికుడిని చికిత్స కోసం రాజౌరిలోని సైని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.