న్యూఢిల్లీ: పేపర్‌ లీక్‌ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు శాశ్వతంగా చెక్‌ పెట్టేందుకు వీలుగా ఒక కొత్త బిల్లును తీసుకొస్తామని, శుక్రవారం జరిగే కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు గురువారం అర్ధరాత్రి ఓ వీడియోలో వెల్లడించారు. ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లును అతి త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని తెలిపారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటించడం తెలిసిందే. అయినప్పటికీ ప్రధాని మోదీ అర్ధరాత్రి ఈ అంశంపై రెండోసారి స్పందిస్తూ ప్రభుత్వం ఏం చేయబోతుందో వెల్లడించారు. 

Continues below advertisement

పేపర్‌ లీక్‌ అనేది సాధారణ విషయం కాదు.  లక్షలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. పేపర్ లీకేజీలకు బాధ్యులైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపించాం.  విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండాలని ప్రభుత్వం రీఎగ్జామ్ నిర్వహించింది. ఈ సమస్యను కూకటి వేళ్లతో పెకలించేందుకు గత అనేక కఠిన చర్యలు తీసుకున్నాం. పేపర్ లీకేజీ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశించాం. నేడు జరిగే కేబినెట్ భేటీలో పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా బిల్లుపై చర్చిస్తాం. పార్లమెంట్‌లో త్వరలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటామని’ వీడియోలో ప్రధాని మోదీ పేర్కొక్నారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు

పరీక్షల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఈ కేసులను త్వరితగతిన విచారించేందుకు ఒక ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును నోటిఫై చేసింది. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కానుండగా జస్టిస్ అను గ్రోవర్‌ దీని కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. నీట్‌ తదితర పోటీ పరీక్షల లీకేజీ వ్యవహారాలకు సంబంధించిన కేసుల విచారణ ఈ కోర్టు చేపట్టనుంది. 

Also Read: Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!

దీక్ష విరమించిన వాంగ్‌చుక్..

నీట్‌ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమించారు. గురువారం అర్ధరాత్రి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు ఆసుపత్రికి వెళ్లి వాంగ్‌చుక్‌ను పరామర్శించారు. ఆయన  డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ ఇవ్వడంతో, నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో 26 రోజుల తరువాత వాంగ్ చుక్ దీక్ష విరమించారు. కేంద్ర మంత్రులు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీజేపీ ప్రతినిధులు, సోనమ్ వాంగ్‌చుక్‌లతో చర్చలు జరపన్నారు.

విద్యాశాఖ కార్యదర్శి బదిలీ

మరోవైపు నీట్‌ లీకేజీ వ్యవహారంలో వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వినీత్ జోషిని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో నరేశ్‌ కుమార్‌ గంగ్వార్‌ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బాధ్యతలను టీకే అనిల్‌ కుమార్‌కు అప్పగించింది. నీట్‌ లీకేజీ ఆరోపణలు, సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల మూల్యాంకన వివాదాలతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సమయంలో కేంద్రం చర్యలు చేపట్టింది.