ఐదేళ్ల క్రితం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ రోజు రెండు అవిశ్వాస తీర్మానాలు రావడంపై మోదీ స్పందిస్తూ 2023లో ఇలాంటి అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవ్వండీ అంటూ విపక్షాలకు చురకలు అంటించారు. ఆ విడియో ఇప్పుడు బిజేపీ అనుకూల వర్గం వైరల్ చేస్తోంది. 


బడ్జెట్ సెషన్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా 2019 ఫిబ్రవరి 7న మోదీ మాట్లాడారు. అయితే అదే రోజు రెండు అవిశ్వాస తీర్మానాలు సభ ముందుకు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ 2023లో మరో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్ధం కావాలని ప్రధాని చెప్పారు. అలాంటివి వీగిపోవడం ఖాయమని అంటూ కామెంట్ చేశారు. 


సభలో ప్రధాని చేసిన ప్రసంగంలో ఏం ఉందంటే..."నేను నా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. 2023లో మళ్లీ అవిశ్వాసం తీసుకురావడానికి మీకు అవకాశం వచ్చేలా సిద్ధంగా ఉండండి" అని లోక్‌సభలో ప్రధాని మోదీ అన్నారు. 


మోదీ నుంచి అలాంటి మాట వచ్చిన వెంటనే అధికార పార్టీ నేతలు బల్లలు చరుస్తూ బిగ్గరగా నవ్వారు. 


ఇది సమర్పన్ భవ (సేవ) అంటే ఇద్దరు (ఎంపీల) నుంచి మేము ఇక్కడ (అధికారంలో) కూర్చున్నాము. ఇక అహంకార్ (అహంకారం) ఫలితంగా 400 నుంచి 40కి దిగజారారు. ఈరోజు ఎక్కడున్నారో చూడు...’’ అని కాంగ్రెస్ పేరు చెప్పకుండానే మోదీ విమర్సలు చేశారు. 


ప్రధాని వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పార్టీ సీనియర్ నేతలు సభలోనే కూర్చొని ఉన్నారు. 


ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ అవిశ్వాసం వీగిపోయంది. ప్రభుత్వం విజయం సాధించింది.మోదీ ప్రిడిక్షన్ ఇలా ఉంటుందని బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. 






ఈసారి మణిపూర్‌లో ప్రతిష్టంభనను కారణంగా చూపిస్తూ కాంగ్రెస్ సహా ఇండియాలోని పక్షాలు, బీఆర్‌ఎస్‌ మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. లోక్‌సభలో ఈ తీర్మానం ఓడిపోయే అవకాశం ఉన్నప్పటికీ నోటీసులు ఇచ్చాయి. ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ మణిపూర్‌పై  ప్రధాని మోడీతో బలవంతంగా ప్రకటన చేయించడం కోసమే ఈ చర్య తీసుకున్నట్టు పార్టీలు చెబుతున్నాయి. 


జూలై 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్‌ అల్లర్లపై పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం జరుగుతూనే ఉంది. సమావేశానికి ఒక రోజు ముందు ఇద్దరు మహిళలను ఊరేగించిన వీడియో వైరల్‌గా మారింది. దేశవ్యాప్త ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. 'ఇండియా' కూటమిలో భాగం కాని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు చెందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రత్యేక అవిశ్వాస తీర్మానం దాఖలు చేసింది.