PM Modi vs Mete: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు జరిపిన నిరసన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను పోస్టు చేశారు. ముఖ్యంగా, ప్రధాని మోదీ ఆ వీడియోను సెల్ఫీ మోడ్లో రికార్డ్ చేసి యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఫేస్బుక్లో ప్రధాని మోదీ వీడియోను మెటా తొలగించింది. దీనిపై ఏబీపీ న్యూస్ మెటాను సంప్రదించింది. ఎందుకు ఇలా చేశారంటూ ప్రశ్నించగా, అది ఒక వివరణ ఇచ్చుకుంది. ఇంతలో కేంద్ర ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ కూడా దీనిపై స్పందించి మెటా, ఇన్స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్స్ను పిలిపించింది.
సీజేపీ నిరసనల సమయంలో అర్థరాత్రి వేళ ప్రధాని మోదీ మొదటి వీడియోను అప్లోడ్ చేశారు. ఆ వీడియోనే ఫేస్బుక్ తొలగించింది. తెల్లవారుజామున 1:25 గంటలకు 'ఎందుకో చూడండి' (See Why) అనే ఆప్షన్పై క్లిక్ చేయగా, ఒక చట్టపరమైన రిక్వస్ట్ మేరకు దానిని తొలగించినట్టు చెప్పింది. ఏబీపీ న్యూస్కు ఇచ్చిన సమాధానంలో, ప్రధానమంత్రి వీడియో పొరపాటున డిలీట్ అయ్యిందని, ఇప్పుడు దానిని సరిదిద్దినట్లు మెటా పేర్కొంది. విమర్శలు వెల్లువెత్తడంతో మెటా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. జరిగిన తప్పునకు క్షమాపణలు చెప్పింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై గందరగోళం
బొద్దింక జనతా పార్టీ మద్దతుదారులు దాదాపు నెలరోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపారు. జూలై 20న సీజేపీ పార్లమెంటు మార్చ్ నిర్వహించింది. జనం పార్లమెంటు వైపు కదులుతుండగా, వారిని ఆపడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ సమయంలో, మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టూ ఉన్న వివాదం తీవ్రమవుతున్న తరుణంలో, ప్రధాని మోదీ జెన్-జీ కోసం ఒక వీడియో షేర్ చేశారు. పేపర్ లీక్ విషయాన్ని తాను సీరియస్గా తీసుకున్నామని కఠిన చర్య తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
లేటెస్ట్ వీడియోలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు
పరీక్షల సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మరో వీడియోలో, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థను నిర్ధారిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా ఉపయోగించడం ద్వారా పారదర్శకతను తీసుకువస్తూ, ప్రభుత్వం ఈ టాస్క్ ఫోర్స్ సిఫార్సులను అమలు చేస్తుందని ఆయన అన్నారు.
