ED Rains In Bengaluru | బెంగళూరు: హైదరాబాద్లో ఇటీవల దొరికిన డ్రగ్స్ కేసుకు సంబంధించి నగరంతో పాటు ఇతర రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. NDPS కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు చేపట్టింది. ఎన్డిపిఎస్ (NDPS) చట్టం కింద నమోదైన కేసు ఆధారంగా బెంగళూరులోని రెండు చోట్లతో పాటు, హైదరాబాద్లోని ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలు హైదరాబాద్కు రావడం, వాటి సరఫరా వ్యవహారానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కొన్ని బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు.
ఈ భారీ డ్రగ్స్ నెట్వర్క్కు సంబంధించి ముందస్తుగా హైదరాబాద్ పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఆ కేసు దర్యాప్తులో వెలుగుచూసిన అక్రమ ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ కోణంలోనే ఈడీ అధికారులు ఇప్పుడు బెంగళూరులోని కీలక ప్రాంతాలపై దాడులు నిర్వహించి తనిఖీలు చేస్తున్నారు.
హైదరాబాద్లో డ్రగ్స్ దందా.. పోలీసును తొక్కించిన నిందితుడి అరెస్ట్
హైదరాబాద్లోని అబిడ్స్లో డ్రగ్స్ చేతులు మారుతున్నాయన్న సమాచారంతో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం పాయల్ ఫుట్వేర్ వద్ద నిఘా ఉంచగా, కారులో ఉన్న మహ్మద్ సైఫ్కు ఓ వ్యక్తి డ్రగ్స్ ప్యాకెట్ అందించి వెళ్లడాన్ని గమనించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా, సైఫ్ తన కారును వేగంగా రివర్స్ చేసి పోలీసును తొక్కించి, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మహేందర్యాదవ్ కాలుకు తీవ్రగాయమవగా, ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్లకు స్వల్ప గాయాలయ్యాయి.
గాయపడినప్పటికీ వెనకడగు వేయని పోలీసులు నిందితుడిని సినీఫక్కీలో 2.5 కిలోమీటర్ల దూరం వెంబడించి అఫ్జల్గంజ్ సమీపంలో పట్టుకున్నారు. పోలీసులపై దాడికి పాల్పడిన సైఫ్పై అబిడ్స్, అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లలో హత్యాయత్నం కేసులు నమోదు చేసి ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారని లింకులపై ఆరా తీస్తున్నారు.
