ఉజ్వల లబ్ధిదారులకు ఎల్‌పీజీ సిలిండర్‌ను రూ.600 కే అందిస్తామని దీని వల్ల 70 లక్షల కుటుంబాలకు లాభం చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌ పర్యటనలో చేసిన ప్రసంగంలో వెల్లడించారు. ఎల్‌పీజీ సిలిండర్ల సబ్సిడీని రూ.200 నుంచి రూ.300 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉజ్వల లబ్ధిదారులకు లాభం చేకూరనుంది. . రాజస్థాన్‌లో రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రధాని రెండు వారాల్లో మూడు సార్లు అక్కడికి వెళ్లారు. గురువారం జోధ్ పూర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మోదీ విమర్శలు గుప్పించారు. అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలో పేపర్ లీక్‌ మాఫియా, అవినీతి, దళితులు మహిళలపై నేరాలు పెరిగాయని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతను పేపర్‌ లీక్‌ మాఫియాకు బలి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని యువకులు తమకు న్యాయం కావాలని డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిన కాంగ్రెస్‌ పేపర్‌ లీక్‌ మాఫియాపై బీజేపీ కఠిన చర్యలు తీసుకుంటుందని రాజస్థాన్‌ ప్రజలకు మోదీ హామీ ఇచ్చారు.


సభలో మాట్లాడుతూ మోదీ.. ఈరోజు జోధ్‌పూర్‌, మార్వాడ్‌ ప్రజలు పలు బహుమతులు తీసుకుంటారని అన్నారు. ఉజ్వల పథకం మహిళా లబ్దిదారులకు రూ.600 కే ఎల్‌పీజీ సిలిండర్‌ ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిందని నిన్ననే నిర్ణయించిందని తెలిపారు. దీనిని అందించడం కోసం దిల్లీ నుంచి తాను వచ్చినట్లు చెప్పారు. అంతకుముందు రాజస్థాన్‌లో రూ.5000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. ప్రాజెక్టులు రోడ్డు, రైలు, విమానయానం, ఆరోగ్యం మరియు ఉన్నత విద్య వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు అందులో ఉన్నాయి.


రాజస్థాన్‌ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మోదీ తెలిపారు. అయితే అవినీతి, అల్లర్లలో కాంగ్రెస్‌ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంటోందని దుయ్యబట్టారు. మహిళలు, దళితులపై అఘాయిత్యాలలో రాజస్థాన్‌ నెంబర్‌ 1 గా నిలిచిందని మోదీ ఆరోపించారు. డ్రగ్స్‌ వ్యాపారానికి కాంగ్రెస్‌ స్వేచ్ఛ నిచ్చిందని ఆయన విమర్శలు చేశారు. 'ఐదేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. మొత్తం ఇక్కడ 'కుర్సీ కా ఖేల్' కొనసాగింది.'లాల్ డైరీ' గురించి విన్నారా? ఆ డైరీలో కాంగ్రెస్ అవినీతికి సంబంధించిన ప్రతి అకృత్యాలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. చెప్పండి ఆ డైరీ రహస్యాలు బయటికి రాకూడదా?నిజాయితీ లేని వారిని శిక్షించకూడదా?కాంగ్రెస్ ప్రభుత్వం డైరీ రహస్యాలను బయటికి తెస్తుందా?నిజం బయటకు రావాలంటే మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ' అని మోదీ విమర్శలు చేశారు. 



మోదీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌లో 350 పడకల ట్రామా సెంటర్‌, క్రిటికల్‌ కేర్‌ హాస్పిటల్‌ బ్లాక్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ కింద ఏడు క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చేసే పనులను ప్రారంభించారు. ఒక్క ట్రామా సెంటర్‌కే రూ.350 కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. హెరిటేజ్ స్పెషల్-మార్వార్ మరియు రునిచా ఎక్స్‌ప్రెస్-జైసల్మేర్ రైళ్లను కూడా ప్రధాన మంత్రి గురువారం జోధ్‌పూర్‌లో జెండా ఊపి ప్రారంభించారు. జోధ్‌పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక టెర్మినల్ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ. 1,135 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఐఐటీ జోధ్‌పూర్ క్యాంపస్‌ను కూడా ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.