PM Modi Reaction On Haryana Election Results | న్యూఢిల్లీ: హర్యానా ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్ విజయం అందించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భగవద్దీత పుట్టినచోట బీజేపీ మరోసారి విజయం సాధించిందని చెప్పారు. తమపై విశ్వాసం ఉంచిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ఢిల్లీలో మోదీ ప్రసంగించారు. ప్రస్తుతం నవరాత్రులు జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదంతో బీజేపీ హర్యానాలో గెలిచిందన్నారు.


జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిని ప్రధాని మోదీ అభినందించారు. గతంలో ఎన్నడు లేని విధంగా జమ్మూకాశ్మీర్ లో  ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. జమ్మూలో బీజేపీ భారీగా ఓటు శాతాన్ని సాధించడం, ప్రజలు తమపై విశ్వాసం ఉంచినట్లు భావించాలన్నారు. ఇతర పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తే బీజేపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగి అత్యధిక ఓటు శాతం సాధించిన పార్టీగా నిలవడం గర్వకారణం అన్నారు. 






హర్యానాలో 13సార్లు ఎన్నికలు జరిగితే, 10సార్లు ప్రజలు ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చుతూ తీర్పు ఇచ్చారు. కానీ ఈసారి బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. అది కేవలం బీజేపీకి సాధ్యమైంది. ఈసారి బీజేపీకి ఎక్కువ ఓటు శాతంతో పాటు ఎక్కువ సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. అధికారం తమ హక్కు అనేలా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారని.. హర్యానా ప్రజలు తమ ఓటుతో వారికి బుద్ధి చెప్పారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ విజయం కోసం ఎంతగానో కృషి చేసిన కార్యకర్తలకు రుణపడి ఉంటామన్నారు. అరుణాచల్ ప్రదేశ్, గోవాలో మూడోసారి బీజేపీని అధికారంలోకి తెచ్చారు. అధికారం లేకపోతే కాంగ్రెస్ తట్టుకోలేదు. అందుకే అధికారం కోసం ఆ పార్టీ ఏమైనా చేస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అందుకే కాంగ్రెస్ కు కొన్ని రాష్ట్రాల్లో నో ఎంట్రీ బోర్డు పెట్టినా వారిలో మార్పు రాలేదన్నారు. దళితులను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు..


హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా, బీజేపీ 48 సీట్లు నెగ్గి హ్యాట్రిక్ కొట్టింది. కాంగ్రెస్ కూటమి 37 స్థానాల్లో విజయం సాధించగా, ఐఎన్‌ఎల్‌డీ 2 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 3 చోట్ల గెలిచారు.
జమ్మూకాశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లుండగా.. తాజా ఫలితాలలో కాంగ్రెస్ - నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 49 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీజేపీ 29 స్థానాలకు పరిమితమైంది. పీడీపీ 3, ఇతరులు 9 చోట్ల విజయం సాధించారు.


Also Read: Election Results Memes : హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై మీమ్స్ ట్రెండింగ్ - ఈవీఎంలపై ఎన్ని జోకులేస్తున్నారో తెలుసా