Pankaja Munde: దివంగత బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే కుమార్తె, మహారాష్ట్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే షాకింగ్ కామెంట్లు చేశారు. తాను ఉండేది బీజేపీ పార్టీలోనే అయినా అది తన పార్టీ కాదని వెల్లడించారు. గురువారం రోజు ఆమె ఓ కార్యక్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అయితే దివంగత సీనియర్ బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే కుమార్తె, పంకజా ముండే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుండి ప్రజల్లోకి రావడం చాలా వరకూ తగ్గించేశారు. 2014 నుంచి 2019 మధ్య బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా.. పంకజా ముండే కేబినెట్ మంత్రిగా పని చేశారు. 


అవి బీజేపీ ఉద్దేశించినవి కావు, ఆర్సీపీని ఉద్దేశించనవి!


చాలా కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చిన ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీ చాలా పెద్ద పార్టీ అని, తనకు చెందని పార్టీ అని అన్నారు. కానీ తాను బీజేపీకి చెందిన దాన్ని కాదని.. మా నాన్నతో సమస్య వస్తే మా అన్న ఇంటికి వెళతాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే గోపీనాథ్ ముండే అనుచరులు కొంతమంతి మహాదే జాంకార్ నేతృత్వంలోని రాష్ట్రీయ సమాజ్ పక్ష (ఆర్‌ఎస్‌పీ)ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. 


దక్కని మంత్రి పదవి, అందుకే దూరం.. దూరం..!


గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే పంకజా ముండేను రాష్ట్ర బీజేపీ పక్కన పెట్టిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 2022లో ఏక్ నాథ్ షిండే - ఫడ్నవీస్ మంత్రివర్గం మొదటి విస్తరణలో ఆమెకు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌ కులే జనవరిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పార్టీకి, ఎమ్మెల్యే పంకజా ముండేకు మధ్య కొందరు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. గత రాష్ట్ర ఎన్నికలలో ఆమె తన సొంత గడ్డ అయిన పర్లీలో తన బంధువు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన ధనంజయ్ ముండే చేతిలో ఓడిపోయారు.