Operation Ajay: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి భారత్ ‘ఆపరేషన్ అజయ్‌’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇజ్రాయిల్ నుంచి 212 మంది భారతీయులతో కూడిన AI1140 విమానంలో శుక్రవారం న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. వారికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇజ్రాయిల్ లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో 212 మంది భారతీయులతో కూడిన మొదటి చార్టర్ విమానం గురువారం బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరింది.






ఆపరేషన్ అజయ్ గురించి ఇజ్రాయిల్ విద్యార్థి శుభం కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. చాలా మంది విద్యార్థులు ఉద్వేగానికి లోనయ్యారు. తాము భారత రాయబార కార్యాలయం ద్వారా ప్రతి భారతీయ పౌరుడికి కొన్ని నోటిఫికేషన్‌లు, లింక్‌లు ఇచ్చారని.. ఇది ధైర్యాన్ని పెంచిందన్నారు. భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండడం తమకు ఉపశమనం కలిగించిందన్నారు. చంటి బిడ్డతో వచ్చిన మరో ప్రయాణికురాలు ఇజ్రాయెల్‌లో తమ పరిస్థితి చెప్పుకుని బోరున విలపించింది. తిరిగి ఇండియా వస్తామని అనుకోలేదని, భారత్‌లో కాలుమోపిన తరువాత ఊపరి పీల్చుకున్నట్లు చెప్పారు.






భారతీయుల తరలింపుపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ప్రస్తుతానికి చార్టర్ విమానాలను ఉపయోగిస్తున్నామని ఈ ఉదయం 212 మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. అవసరమైతే వైమానిక దళాన్ని కూడా ఉపయోగించుకుంటామని అన్నారు. ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న మన భారతీయ పౌరులు త్వరలో రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. దాదాపు 18,000 మంది భారతీయులు ఇజ్రాయిల్‌లో ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. 


మందుగా పేర్లు రిజిస్టర్ చేసుకున్న వారిని తొలుత భారత్ తరలించినట్లు చెప్పారు. భారతీయులు తిరిగి మన దేశానికి తీసుకుని వచ్చేందుకు వీలుగా ఈ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 7న ఎయిర్ ఇండియా తన విమానాలను నిలిపివేసింది. తిరిగి వచ్చే వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని.. వారి రిటర్న్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు భారతీయులెవరూ గాయపడినట్లు తమకు సమాచారం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 


AFC-17, C-230, IL-76 స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నాయని అరిందమ్ బాగ్చి చెప్పారు. వెస్ట్ బ్యాంక్‌లో 12 మంది భారతీయులు, గాజాలో 3 నుంచి 4 భారతీయులు ఉన్నారని తాము వారితో టచ్‌లో ఉన్నామని, వారిని తిరిగి తీసుకువస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై ఆయన స్పందించారు. మానవతా చట్టాన్ని అనుసరించడం అంతర్జాతీయ బాధ్యత అని బాగ్చి అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరాడాల్సిన బాధ్యత ప్రపంచానికి ఉందని చెప్పారు.
 
మీడియా నివేదికల ప్రకారం ఇజ్రాయిల్‌లో ఇప్పటివరకు 222 మంది సైనికులతో సహా 1300 మందికి పైగా మరణించినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. 1973లో ఈజిప్ట్ , సిరియాతో వారాలపాటు జరిగిన యుద్ధం తర్వాత ఇంత భారీ సంఖ్యలో మరణాలు కనిపించలేదన్నారు. అక్కడి అధికారుల ప్రకారం హమాస్ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్‌లో మహిళలు, పిల్లలతో సహా కనీసం 1,417 మంది మరణించారు.