పాట్నా: బిహార్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మార్పు చోటుచేసుకోనుంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయన సోదరుడు సతీష్ కుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా జెడియు (JDU) నాయకుడు, నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ పేరును తెరపైకి తెచ్చారు. సతీష్ కుమార్ చేసిన ఈ ప్రకటన బిహార్ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది.
పాట్నాలో మీడియాతో మాట్లాడిన సతీష్ కుమార్.. నిశాంత్ కుమార్ అన్ని విధాలా సీఎం పదవికి సమర్థుడని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ఒకవేళ నిశాంత్ కుమార్పై నమ్మకం ఉంచి ఆయనకు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగిస్తే, ఆయన దానిని చక్కగా నిర్వహిస్తారు. ఆయన మానసికంగా ఆరోగ్యంతో ఉన్నారు. బిహార్ను నడిపించే బాధ్యత ఆయన భుజాలపై పెడితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు’ అని అన్నారు.
రాజ్యసభకు నితీష్ కుమార్ఇటీవల బిహార్లోని 5 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నితీష్ కుమార్ విజయం సాధించారు. ఇప్పుడు ఆయన ఢిల్లీ బాట పడుతున్నారు. దీనిపై సతీష్ కుమార్ స్పందిస్తూ.. ఆయన బిహార్ వదిలి వెళ్లాలని రాష్ట్రంలో ఎవరూ కోరుకోవడం లేదన్నారు. అయితే రాజ్యసభకు వెళ్లాలనేది నితీష్ కుమార్ సొంత నిర్ణయమని చెప్పారు. ప్రస్తుతం సీఎం నితీష్ తన 'సమృద్ధి యాత్ర' ద్వారా పలు పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
రాజకీయాల్లోకి నిశాంత్ కుమార్ ఎంట్రీ..
'బిహార్ దివస్' సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ యాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన జెడియు కార్యకర్తలు, సామాన్య ప్రజలతో మమేకమై జేడీయూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయనున్నారు.
నిశాంత్కు పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ ఇప్పుడు జేడీయూ పార్టీ నుంచి గట్టిగా వినిపిస్తోంది. పలువురు నాయకులు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. బాబాయ్ సతీష్ కుమార్ సైతం బిహార్ కొత్త సీఎంగా నిశాంత్ కుమార్ సమర్థుడని, ఆయనకు బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించారు. ఇటీవల నిశాంత్ తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు, అక్కడి ప్రజలు కూడా నితీష్ కుమార్ తర్వాత ఆయనే రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కావాలని గట్టిగా డిమాండ్ చేశారు.
