NIA Raids in Tamil Nadu: 


30 ప్రాంతాల్లో సోదాలు..


NIA భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది. దక్షిణాదిన తమిళనాడు, తెలంగాణ దాదాపు 30 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. అరబిక్‌ భాష నేర్పుతామని చెప్పి యువతను ఐసిస్‌లోకి దింపుతున్న ముఠా కోసం గాలింపు చేపట్టింది. కోయంబత్తూర్‌లోని 21 ప్రాంతాల్లో సోదాలు చేసింది. చెన్నైలో మూడు చోట్ల, తెంకసీలో ఓ చోట సోదాలు జరిగాయి. తమిళనాడుతో పాటు ఇటు తెలంగాణలోనూ హైదరాబాద్‌లో ఐదు చోట్ల సోదాలు జరిపింది NIA. గతేడాది కోయంబత్తూర్‌లో అక్టోబర్‌లో కార్‌లో బాంబ్ పెట్టి పేల్చిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ పని తామే చేసినట్టు ఐసిస్ ప్రకటించింది. అప్పటి నుంచి ఆధారాలు సేకరిస్తోంది NIA. ఈ కేసులో ఇటీవలే కొన్ని ఆధారాలు లభించాయి. ఈ పేలుడు ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులు తమిళనాడు, హైదరాబాద్‌లో ఉన్నట్టు తెలిసింది. వెంటనే..రంగంలోకి దిగిన బృందాలు ఒకే సమయంలో సోదాలు చేపట్టాయి. ఇదే ఘటనతో సంబంధం ఉన్న ఓ నిందితుడిని గత నెల అరెస్ట్ చేశారు. మహమ్మద్ అజారుద్దీన్ అలియాస్ అజర్‌ని పట్టుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన 13 వ నిందితుడు అజర్. 




కోయంబత్తూర్ పేలుడు ఘటన..


ఈ పేలుడు ఘటనపై గతేడాది అక్టోబర్ 27న కేసుని రీరిజిస్టర్ చేసింది NIA. అక్టోబర్ 23న పేలుడు సంభవించింది. సంగమేశ్వర ఆలయం ఎదుట పార్క్‌ చేసిన కార్‌లో బాంబు పెట్టి పేల్చారు ఉగ్రవాదులు. స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. ఆ కార్‌లో ఉన్న డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఐసిస్‌ భావజాలంతో ప్రేరేపితమైన ఈ పనికి ఒప్పుకున్నట్టు విచారణలో తేలింది. ఇప్పటి వరకూ ఈ కేసుకి సంబంధించి రెండు ఛార్జ్‌షీట్‌లను దాఖలు చేసింది. ఈ సోదాల్లో NIA అధికారులు పలువురుని అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ ఫోన్లు,లాప్ టాప్ లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. రూ.60 లక్షల భారత కరెన్సీ తో పాటు 18,200 అమెరికన్ డాలర్లు సీజ్ చేశారు. కోయంబత్తూర్‌లోని 22 చోట్ల , చెన్నైలోని 3 ప్రాంతాలు తమిళనాడులోని తెన్‌కాసి జిల్లాలోని కడైయనల్లూర్‌లో ఒక చోట దాడులు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ , సైబరాబాద్‌ పరిధులలో 5 చోట్ల సోదాలు నిర్వహించారు. మదర్సాల ముసుగులో ISIS భావజాలాన్ని నూరిపోస్తున్నట్టు గుర్తించారు.