Mahadev Betting App : మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ (Mahadev Betting App) స్కామ్‌ భారత్ లో దుమారం రేపింది. యాప్‌ ప్రమోటర్లలో రవి ఉప్పల్‌ (Ravi Uppal)ను అదుపులోకి తీసుకున్న దుబాయి పోలీసులు, తాజాగా మరో ప్రమోటర్ సౌరభ్‌ చంద్రఖర్‌ను (Sourabh Chandrakar) కూడా నిర్భంధంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్‌ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు వీరిద్దరిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. నిందితులపై ఇంటర్‌పోల్‌ (Interpol) ఇటీవలే రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీచేసింది. దాని ఆధారంగా ఈ యాప్‌ యజమానుల్లో మొదట రవి ఉప్పల్‌ను అదుపులోకి తీసుకోగా, ఇపుడు మరో ప్రమోటర్‌ సౌరభ్‌ చంద్రఖర్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్లు సమాచారం. దుబాయ్‌ కేంద్రంగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రవి ఉప్పల్‌, సౌరభ్‌ చంద్రఖర్‌...భారత్‌లో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ ఖాతాలకు హవాలా రూపంలో తరలిస్తున్నట్లు ఈడీ గుర్తించింది.


70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా
మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు సౌరభ్‌ చంద్రకర్‌, రవి ఉప్పల్‌ భారత్‌లో 4వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు సుమారు 200 మంది కస్టమర్లున్నారు. దీని ప్రకారం రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతోంది. 70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా ఇస్తామని వివిధ దేశాల్లో బీటర్లను నియమించుకున్నారు. ఈ యాప్‌ కార్యకలాపాలు యూఏఈ ప్రధాన కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ విచారణలో తేలింది. సౌరభ్‌ చంద్రకర్, రవి ఉప్పల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో హవాలా మార్గంలో సొమ్ము తరలిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గుర్తించింది. రూ.417 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ శుక్రవారం సీజ్‌ చేసింది. ఈ కేసులో బాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు తాజాగా వెలుగుచూడడం కలకలం రేపుతోంది. 


ప్రమోటర్ పెళ్లి ఖర్చు రూ.200 
మహదేవ్‌ బెట్టింగ్ యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రకర్‌ వివాహం, ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో జరిగింది. రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్‌ సెలబ్రిటీలను ఆహ్వానించినట్లు ఈడీ గుర్తించింది. పెళ్లి కోసం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి రూ.112 కోట్లు హావాలా మార్గంలో నిర్వాహకులు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఒక్క హోటల్‌ గదుల కోసమే రూ.42 కోట్లు వెచ్చించినట్లు తెలిసింది. మరో నిర్వాహకుడు రవి ఉప్పల్‌ నిర్వహించిన మరో పార్టీకీ బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాజరైనట్లు తెలిసింది. ఈ క్రమంలో హవాలా మార్గంలో వచ్చిన సొమ్మున బాలీవుడ్‌ సెలబ్రిటీలకు ఈవెంట్‌ మేజ్‌మెంట్‌ సంస్థలు చెల్లింపులు చేసినట్లు తెలిసింది. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపింది. బాలీవుడ్ నటులు ఆన్‌లైన్‌లో యాప్‌ను ప్రచారం చేసి, అందుకు బదులుగా ప్రమోటర్ల నుంచి డబ్బు అందుకున్నారన్నది ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో 14 నుంచి 15 మంది సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రణ్‌బీర్‌ కపూర్ , హాస్యనటుడు కపిల్‌ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, శ్రద్దాకపూర్ , హీనా ఖాన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.