బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్​ సోషల్​ మీడియా ఎక్స్​ వేదికగా ఆసక్తికర పోస్ట్​ చేశారు. ‘బీజేపీని మరోసారి గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్​’ అంటూ పోస్ట్​ పెట్టారు. దీనికి రాహుల్​ గాంధీ గురించి ఆయన  గతంలో మాట్లాడిన ఓ వీడియోను ట్యాగ్​ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలోనే కేటీఆర్​ ఈ పోస్ట్​ పెట్టినట్లు తెలుస్తోంది.


బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్​ గాంధీనే..
మరోసారి బీజేపీని గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్​ అంటూ కేటీఆర్​ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్​ ఎక్స్​లో ట్రెండ్​ అవుతోంది. ఈ పోస్ట్​కు గతంలో తాను ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూను కేటీఆర్​ జతచేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవరైనా ఉంటే అది రాహుల్​ గాంధీనే అని ఎద్దేవా చేశారు.


బీజేపీని నిలువరించే సత్తా రాహుల్​కు లేదు
ఆ వీడియోలో కేటీఆర్​ మాట్లాడుతూ..  ‘రాహుల్​ గాంధీకి బీజేపీని నిలువరించే సత్తా లేదు. ఒకవేళ ఆయనకు ఆ దమ్ము ఉంటే వెళ్లి ఉత్తర్​ప్రదేశ్​లో, గుజరాత్​లో, బిహార్​లో ఆ పార్టీతో కొట్లాడాలి. కానీ అలా చేయకుండా తెలంగాణకు వచ్చి బీజేపీని నిలువరించే సత్తా ఉన్న నేతలతో పోరాడతానంటారు. ​దేశంలో మోదీకి ఉన్న అతి పెద్ద కార్యకర్త రాహుల్​ గాంధీనే. ఆయన లాంటి వ్యక్తి ఉన్నంతకాలం నరేంద్ర మోదీ ఏమైనా చేయలరు. ఎంతకాలమైనా దేశాన్ని పాలించగరు’ అని అన్నారు.


అస్త్రసన్యాసం చేసే రాహుల్​ గాంధీ అసలు నాయకుడేనా? 
ప్రస్తుతం దేశంలో బీజేపీని నిలువరించేవి అవి కేవలం రీజినల్​ పార్టీలు, స్ట్రాంగ్​ లీడర్లైన కేసీఆర్​, కేజ్రీవాల్​, మమతా బెనర్జీ స్టాలిన్​ లాంటి వారు మాత్రమేనన్నారు. దేశమంతా భారత్​ జోడో యాత్ర చేపట్టిన రాహుల్​ గాంధీ గుజరాత్​లో ఎందుకు చేయలేదని అడిగారు. మ్యాచ్​ ఫిక్సింగా లేక మోదీ అంటే రాహుల్​కు భయమా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అస్త్రసన్యాసం చేసే రాహుల్​ గాంధీ అసలు నాయకుడేనా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేత ముందుండి నడిపిస్తున్న కాంగ్రెస్​ పార్టీ మోదీని ఏం ఎదుర్కొంటుంది, బీజేపీని ఎలా ఓడిస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో కేటీఆర్​ చేసిన ఈ పోస్ట్​ వైరల్​ అవుతోంది.


బీజేపీ 45.. ఆమ్​ ఆద్మీ 5
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 36 స్థానాల మ్యాజిక్​ ఫిగర్​ను దాటేసింది. బీజేపీ 45 స్థానాల్లో లీడింగ్​లో ఉంటే ఆమ్​ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. కాంగ్రెస్​తోపాటు ఇతర పార్టీలు ఇంకా ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం.


వెనుకబడ్డ కేజ్రీవాల్​, సీఎం ఆతిషీ
ఆమ్​ ఆద్మీ పార్టీ ప్రముఖులు కూడా వెనుకంజలో ఉండడం గమనార్హం. ఆ ఆప్​ పార్టీ చీఫ్​ అరవింద్ కేజ్రీవాల్​, ముఖ్యమంత్రి ఆతిషీతోపాటు మరికొందరు మంత్రులు కూడా కౌంటింగ్​లో వెనుకబడిపోయారు. మరి కొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.