Kerala Life Partners Swapping Case: కేరళలో సంచలనం రేపిన లైఫ్ పార్టనర్స్ మార్పిడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో జీవిత భాగస్వాముల మార్పిడికి పాల్పడుతున్న వైనాన్ని ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్తతోపాటు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, భార్యల మార్పిడిపై ఫిర్యాదు చేసిన 26 ఏళ్ల మహిళ  జూబీ జాకబ్ ఈ నెల 19న హత్యకు గురైంది. తండ్రి ఇంట్లో ఉంటున్న ఆమె మృతదేహం ఆ ఇంటికి సమీపంలోనే పడి ఉంది. ఆ సమయంలో ఆమె తండ్రి, సోదరుడు ఇంటి వద్ద లేరు. ఒంటరిగా ఉన్న సమయంలో, ఆమె పిల్లలు బయట ఆడుకుంటున్న వేళ ఆ మహిళ  జూబీ జాకబ్ హత్యకు గురైంది. రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఆమెను పిల్లలే ముందు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త షినో మాథ్యూ ఆమెను హత్య చేసినట్లు ఆ మహిళ తండ్రి, కుటుంబ సభ్యులు ఆరోపించారు.   

  


అయితే, తాజాగా ఆ మహిళ హత్యకు గురైన వారం తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భర్త షినో మాథ్యూ విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. తొలుత అతడ్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ప్రభుత్వ మెడికల్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న మాథ్యూ నేడు (మే 29) ఉదయం మరణించాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు మృతి చెందాడని తెలిపారు. పొలోనియం అనే ప్రాణాంతక విషాన్ని తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 


జూబీది హత్యగా తేల్చిన పోలీసులు


జుబీ మృతి తర్వాత కుటుంబ సభ్యులు షినో మాథ్యూపై తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా ద్వారా తన భాగస్వాములను వేధిస్తున్నందుకు షినోపై జూబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఇంట్లోనే జూబీని దారుణంగా హత్య చేశారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని పోలీసులు తేల్చారు. మరణానికి కారణం మెడపై లోతైన కోత. కత్తితో గొంతు కోసి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. రక్తం విపరీతంగా వచ్చింది. యువతి ఫిర్యాదు మేరకు ఆ రోజు భాగస్వామి మార్పిడి కేసులో పలు కీలక సమాచారం బయటకు వచ్చింది. ఆ తర్వాత భర్తకు దూరంగా జూబీ ఇంట్లోనే ఉంటోంది. 


ఫేస్‌బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా జీవిత భాగస్వామి మార్పిడి కేసులో పాల్గొన్న వ్యక్తుల గ్రూపులు పనిచేశాయి. ఈ గ్రూపులను మీట్ అప్ కేరళ, కపుల్ మీట్ కేరళ, కుక్ హోల్డ్ కేరళ మరియు రియల్ మీటింగ్ వంటి పేర్లతో పిలుస్తారు. మెంబర్స్ ఫోటోలు, మెసేజ్ లను పంపడం ద్వారా ఒకరినొకరు తెలుసుకుంటారు. అప్పుడు జీవిత భాగస్వాములను బదిలీ చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నారని తెలియజేయబడుతుంది.