Nipah Virus: కేర‌ళ‌లో నిఫా వైర‌స్ విజృంభిస్తోంది. ఈ నేప‌థ్యంలో కోజికోడ్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థల‌ను వచ్చే ఆదివారం వరకు వారం రోజుల పాటు మూసివేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని పాఠశాలలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ట్యూషన్ సెంటర్లు , ఇతర విద్యా సంస్థలకు ఈ మూసివేత ఆర్డర్ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం మరో నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ కావడంతో ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ వైరస్‌ సోకిన వారిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.


నిఫా వైరస్ సోకిన వ్యక్తులతో పరిచయం ఉన్న 1,080 మందిని గుర్తించినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 130 మందిని గుర్తించారు. వారిలో 327 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. కోజికోడ్‌తో పాటు కాంటాక్ట్ లిస్ట్‌లో 29 మంది పొరుగు జిల్లాలకు చెందినవారు ఉన్నారు. మలప్పురంలో 22 మంది, కన్నూర్, త్రిస్సూర్‌లో ముగ్గురు, వాయనాడ్‌లో ఒకరు ఉన్నారు. హై-రిస్క్ కేటగిరీలో 175 మంది సాధారణ వ్యక్తులు, 122 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. 


ఆగస్టు 30న మరణించిన వ్యక్తి కూడా నిఫా వైరస్‌తోనే మరణించాడు. వైద్య పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఇండెక్స్ కేసు ద్వారా ఇతరులకు సోకినట్లు తెలుస్తోంది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో జరిపిన పరీక్షలలో మరణాలు నిపా వైరస్‌తోనే సంభవించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యాయి. పరిస్థితిని సమీక్షించడానికి నిఫా వైరస్ నిర్వహణలో కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి కేంద్ర బృందం రాష్ట్రానికి పంపించినట్లు మాన్‌సుఖ్‌ మాండవియా తెలిపారు.


తొలుత ఆగస్టు 30న 49 ఏళ్ల వ్యక్తి మరణించారు. తర్వాత సెప్టెంబరు 11న సోమవారం 40 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరూ కూడా జ్వరం, న్యుమోనియా లాంటి లక్షణాలతో బాధపడ్డారు. చనిపోయిన వారి నుంచి సేకరించిన నమూనాలను అధికారులు పరీక్షలకు పంపించారు. సంబంధిత ప్రాంతంలో తాము జ్వర సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ సీజన్‌లో తొలి జ్వరం రికార్డైందని వారు తెలిపారు. 


2018 మే నెలలో తొలిసారిగా దక్షిణ భారతదేశంలో నిఫా వైరస్‌ వ్యాప్తి జరిగింది. అప్పుడు మొదటి కేసు కేరళలోని కోజికోడ్‌లో నమోదైంది. అప్పుడు సుమారు 17 మంది ఈ వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో రోగులకు చికిత్స అందించిన ఒక నర్సు కూడా చనిపోయారు. మళ్లీ 2021 లో కూడా కోజికోడ్‌ జిల్లాలో నిఫా వైరస్‌ వ్యాపించి పలువురు మృత్యువాతపడ్డారు. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఓ 12 ఏళ్ల బాలుడు చనిపోయిన ఘటన నమోదైంది.


ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిఫా వైరస్‌ సంక్రమణ అనేది జూనోటిక్‌ వ్యాధి. అంటే ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. కలుషితమైన ఆహారం లేదా నేరుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతారు. జ్వరం ఎక్కువగా వస్తుంది. మరణాల రేటు దాదాపు 70 శాతం ఉంటుందని డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడించింది. ఈ వైరస్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్‌ లేదు.


నిఫా ఎలా వ్యాపిస్తుంది?



  •     ఫ్రూట్ బ్యాట్స్ (గబ్బిలాలు) లాలాజలం నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంటే ఎవరైనా ఈ గబ్బిలాలు కొరికిన పళ్లు తింటే ఈ వైరస్ శరీరంలోకి ఎంటర్ అవుతుంది.

  •     వైరస్ సోకిన ఏదైనా జంతువు బైట్ చేసిన ఫ్రూట్స్ తినడం వల్ల కూడా వైరస్ సోకుతుంది.

  •     నిఫా సోకిన పందులు కూడా వైరస్ కు ప్రధాన కారకాలని అంటున్నారు. 

  •     వైరస్ సోకిన జంతువుతో డైరెక్ట్ కాంటాక్ట్ అయినా ఈ వైరస్ సోకే ప్రమాదముంది.

  •     ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. వైరస్ సోకిన 4- 45 రోజుల్లోపు లక్షణాలు బయటపడే అవకాశం ఉంది.