Kerala Landslide: అప్పటి వరకు సంతోషాలతో రేపటి కోసం ఎదురు చూస్తూ నిద్రకు ఉపక్రమించారు. అర్థరాత్రి భయానక శబ్దాల నడుమ ఏమి జరుగుతుందో అని బయటకు వచ్చి చూసారు. చిమ్మ చీకటి... బండరాళ్లు పడుతున్న శబ్దాలు... ఇళ్లను చుట్టుముట్టిన నీరు ఇది జులై 30న రాత్రి కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలోని చొరాల్ మల, ముండకాయం, వట్టివేటు కన్ను, అట్టమల అనే గ్రామాలు మట్టి దిబ్బలుగా మారిపోయాయి. ఈ గ్రామాల్లో మొత్తం 1000 నివాసాలు ఉండగా 2000 మందికి పైగా జీవనం సాగిస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంతో మంది టీ ఆకు తోటలు, పరిశ్రమల్లో పని చేస్తున్నారు. 


ఆ రాత్రి ఏం జరిగింది...? 
ఇరువన్ జింజి అనే కొండ ప్రాంతంలో ఎప్పుడు చిన్నపాటి పాయలాగా జలపాతం అందంగా కనిపిస్తుంటుంది. కేరళ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో వర్షాలు ప్రతిరోజు పడుతుంటుంది. ఈ వర్షాల కారణంగా కొండల్లో సహజంగా నీటి జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో జులై 29న తీవ్రమైన వర్షాలు కురవడం ప్రారంభమైంది. 30వ తేదీ సాయంత్రం వరకు అదే ఉద్రితి కొనసాగింది. 30న రాత్రి అందరు తమ ఇళ్లలో నిద్ర కు ఉపక్రమించారు. అధికారుల అంచనా ప్రకారం 500 ఎంఎం వర్షపాతం నమోదైంది.




వర్షం కారణంగా ఇరువన్ జింజి అనే కొండ ప్రాంతం నుంచి ల్యాండ్ స్లైడింగ్ గా పిలవబడే కొండ లో వరద నీరు ప్రవాహం ఎక్కువ కావడంతో మట్టి లూజై జారిపోవడం ప్రారంభమైంది. ఆ ప్రాంతమంతా ఏటవాలుగా ఉండడం తో పై నుంచి కిందకి వచ్చిన మట్టి రాళ్లు కిందకు వేగంగా జారడంతో ఒక ఉదుటున 10 కిలో మీటర్ల మేర బండరాళ్లు, మట్టి అత్యంత వేగంగా గ్రామాలపై పడింది. దీంతో నిద్ర లో ఉన్న వారికి అసలు ఏమి జరుగుతుంది... శబ్దాలు ఏంటి... భూకంపం వచ్చిన తీరులో అదురులకు కుటుంబాలకు కుటుంబాలు బయటకు వచ్చి చూసాయి. కాని చిమ్మ చీకట్లో ఏమి జరుగుతుందో అర్థం కాక... బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా ఇళ్ల చుట్టు నీరు నిండిపోయి ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపే వారి జీవితాలు బండరాళ్లు... మట్టి కింద జల సమాధి అయ్యారు. అప్పటివరకు తమ జీవితాలపై ఉన్న ఆశలు అడియాసలు కాగా... గాయాలైన వారు మట్టిలో ప్రాణాల కోసం పోరాటం చేసిన వారు... ఇంట్లోని వారంతా మరణించి ఏ ఒక్కరో బతికి జీవితంలో మరచిపోలేని చేదు జ్ఞాపకం గా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.


అధికారికంగా అయితే మరణాలు చెబుతున్నా... అక్కడ ఉన్న వారు ఎంత మంది అంటే మాత్రం సరైన లెక్కలు లేవు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కేరళ వయనాడ్ ప్రాంతం గురించి ప్రస్తావిస్తూ మేము హెచ్చరించిన అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పడం అది నిజమే అనేలా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్దించారు. ప్రభుత్వాన్ని తప్పు పట్టిన పోయిన ప్రాణాలు.. బతికిన వారు బాధను తీర్చే వారు లేరు. ఇప్పటివరకు 345 మంది మరణించగా.. మృతదేహాలు గుర్తించేందుకు సరైన ఆనవాళహ లేకుండా ఏ అవయవం ఎవరిది... ఏ శరీరం ఎవరిది... ఏ తల ఎవరిది అనేది సైతం గుర్తు తెలియక వైద్యులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.


స్వచ్చంద సేవ
కేరళ రాష్ట్రంలో ప్రజలు కష్టాన్ని చూసిన ఎంతో మంది స్థానికులు, యువత అంతా ముందుండి సహాయక చర్యలు చేపట్టారు. తమ ఇంట్లో కష్టం వచ్చిందని భావించిన అంతే మంది స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి సహాయకచర్యలు చేసే వారికి, రెస్క్యూ సిబ్బంది, మీడియా కు మూడు పూట్ల  ఆహారం, వేడి నీరు, టీ, స్నాక్స్ సుమారు 5 కిలో మీటర్ల మేర పంపిణీ చేస్తున్నారు.




జై జవాన్
ప్రజల రక్షణ కోసం పని చేసే జవాన్లు కేరళ వయనాడ్ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్నారు. చొరాల్ మల్ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోవడంతో బెంగుళూరు లోని మద్రాసు ఇంజినీరింగ్ గ్రూప్ మేజర్ సీతా షెల్కే ఏకైక మహిళా అధికారి జులై 31న రాత్రి 9 గంటల నుంచి 1న సాయంత్రం 5.30 గంటలకు వంతెన నిర్మాణం పూర్తి చేసారు. 24 టన్నుల సామర్థ్యం, 190 అడుగుల పొడవుతో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో బెయిలి అనే తాత్కాలిక వంతెన నిర్మించి సహాయ చర్యలకు అనువైన మార్గం చేసారు. ఆ తరువాతనే సహాయక చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి.


సాంకేతిక పరిజ్ఞానంతో.. 
శిథిలాల కింద మరణించిన వారి కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. రాడార్లు, థర్మల్ స్కానింగ్, డ్రోన్లు వినియోగించి, చివరి మొబైల్ సిగ్నల్ ఆధారంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల సహకారంతో జాగిలాల ద్వారా మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.


వైద్య సిబ్బంది సేవలు
దారుణమైన ఘటనను చూసిన మనకే ఇలా ఉంటే అక్కడ లభించే మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించే వైద్యుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. మరోవైపు సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారికి నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తున్నారు.


ఫారెస్ట్, స్థానిక పోలీసులు 
కేరళ రాష్ట్రం అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కి ఎక్కడ ఏం ఉన్నాయో అన్ని తెలుసు. ఎన్ని నివాసాలు, ఏ ప్రాంతం అనేది తెలుసు. వారి ద్వారా అడవిలో కలియ తిరుగుతూ ప్రాణాల కోసం పోరాటాలు చేస్తున్న వారిని రక్షించేందుకు, మృతదేహాలను గుర్తించేందుకు కృషి చేస్తున్నారు.


చిన్నారి వ్యాసం
చొరాల్ మల్ ప్రాంతంలో ఓ చిన్నారి లయ 8వ తరగతి చదువుతుంది. ఆ చిన్నారి తమ గ్రామంలో ఇలాంటి పరిస్థితులు నెలకున్నాయి. ఎప్పుడైన ప్రమాదం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ఓ వ్యాసం రాసింది. ఈ ఘటనలో ఆ చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు కాగా  తండ్రి మరణించారు. ఇలా జలప్రళయం కారణంగా ఎంతో మంది ఏమి జరిగింది అనే షాక్ లో ఉన్నారు.