Bengaluru: కర్ణాటకలో ప్రైవేట్ సంస్థల్లో స్థానిక రిజర్వేషన్(Local Reservation) బిల్లు సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. స్థానిక యువతను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ బిల్లుపై పారిశ్రామికవర్గాలు భగ్గుమన్నాయి. ఐటీసెక్టార్‌లో(I.T. Sector)  ఒక్కసారిగా  అలజడి రేగింది. నాస్కామ్‌ సహా పలు పారిశ్రామిక సంస్థలు వ్యతిరేకించాయి. ఇదే అదునుగా  పొరుగు రాష్ట్రాలు పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంతో  కాంగ్రెస్(Congress) ప్రభుత్వం నాలుక కరుచుకుంది. తూచ్‌ అంటూ ఈ బిల్లును వెనక్కి తీసుకుంది. సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) ఎక్స్‌లో పెట్టిన పోస్టును తొలగించడమేగాక...ఈ బిల్లు కేవలం ప్రతిపాదనల దశలోనే ఉందంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.


స్థానికులకే ఉద్యోగాలు
ప్రపంచీకరణతో యావత్‌ ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడికి పారిశ్రామికవేత్తలు వారితో మానవవనరులు తరలివెళ్లాయి. ప్రతిభకు ఎలాంటి అడ్డూ లేదని నిరూపించారు. ఇలాంటి సమయంలో కర్ణాటక(Karnataka) ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ వివాదాస్పద బిల్లు మొత్తం రాష్ట్రాన్నే గడగడలాడించింది. ఐటీ(IT), ఐటీఈఎస్‌, పరిశ్రమలు, కర్మాగారాల్లో స్థానికులకే రిజర్వేషన్లు కల్పిస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చింది. ఆయా పరిశ్రమలో సి, డి గ్రేడ్  ఉద్యోగాలన్నీ స్థానికులకే కేటాయించాలని చట్టం చేసింది. మేనేజ్‌మెంట్‌ స్థాయి ఉద్యోగాల్లో 50 శాతం, నాన్‌మేనేజ్‌మెంట్‌లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. ఆ మేరకు రూపొందించిన బిల్లును ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో ఒక్కసారిగా పారిశ్రామికవర్గాలు భగ్గుమన్నాయి. బెంగళూరుకు(Bangalore) గుండెకాయలాంటి ఐటీ ఇండస్ట్రీలో అలజడి రేగింది. ఈ నిర్ణయాన్ని  ఐటీ ఇండస్ట్రీ సమాఖ్యా నాస్కామ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇతర పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాలు సిద్ధరామయ్య ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి.


బిల్లులోని ముఖ్యాంశాలు
కర్ణాటకలోని అన్ని ప్రైవేట్ సంస్థల్లో(Private Industries) సి,డి గ్రేడ్ ఉద్యోగాలు వందశాతం కన్నడిగులకే  కేటాయించేలా రిజర్వేషన్లు( Reseravations) కల్పిస్తూ బిల్లును రూపొందించారు. కర్ణాటకలో పుట్టినవారితోపాటు, 15 ఏళ్లు కర్ణాటకలోనే ఉంటున్న వారినీ స్థానికులగానే పరిగణిస్తారు. ఒకవేళ కన్నడ భాష మాట్లాడుతూ, రాయడం వచ్చినా...సెకండరీగ్రేడ్ సర్టిఫికేట్‌ లేకపోతే రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో నెగ్గినవారిని స్థానిక అభ్యర్థులుగా గుర్తించాలని బిల్లులో పొందుపరిచారు. కర్ణాటకలో కొంతకాలంగా స్థానిక, స్థానికేతురల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కీలకమైన ఉద్యోగాలన్నీ  ఉత్తరాది వారికి దక్కుతున్నాయని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలన్నీ బయటి నుంచి వచ్చిన వారే నిర్వహిస్తున్నారని, పెద్దపెద్ద సంస్థలేవీ స్థానికులకు అవకాశం కల్పించడం లేదని నిరసనలు జరుగుతున్నాయి. ఇక్కడి వనరులను వినియోగించుకోవడమేగాక, ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతున్న సంస్థలు ఆ స్థాయిలో స్థానికులకు ఉపాధి కల్పించడం లేదన్నది వాదన. ఈ వ్యవహారం ఇంకా ముదరకముందే పరిష్కరించాలన్న భావనతో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చింది.


పరిశ్రమలు నుంచి వ్యతిరేకత
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై పారిశ్రామికవేత్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ రాష్ట్రానికి ఆదాయంపరంగా, ఉపాధిపరంగా గుండెకాయలాంటి ఐటీ సెక్టార్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రముఖ టెక్‌ సంస్థ  బయోకాన్‌(Biocon) తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఐటీ పరిశ్రమలు స్థానికత కన్నా ప్రతిభకే అధిక ప్రాధాన్యం ఇస్తాయని కుండబద్దలు కొట్టింది. ఇలాంటి నిర్ణయాలతో పరిశ్రమలు రావాలంటేనే భయపడిపోతాయని తెలిపింది. నాస్కామ్ సైతం సిద్ధూ నిర్ణయాన్ని తప్పుబట్టింది. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఇదే నిర్ణయాన్ని ఇతర దేశాలు, రాష్ట్రాలు తీసుకుంటే అక్కడ పనిచేస్తున్న కన్నడిగుల పరిస్థితి ఏంటని పారిశ్రామికవర్గాలు ప్రశ్నించాయి.


పొరుగు రాష్ట్రాల వల
కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో చెలరేగిన అలజడిని పొరుగు రాష్ట్రాలు అందిపుచ్చుకున్నాయి. ఈ మేరకు ఏపీ ఐటీమంత్రి లోకేశ్(Lokesh) తక్షణం స్పందించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తరలిరావాలని నాస్కామ్‌ను కోరారు. ఐటీ పరిశ్రమలు నెలకొల్పితే ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తామని ఆహ్వానం పలికారు. విశాఖ, అమరావతి సహా ఇతర ప్రాంతాల్లో ఐటీ విస్తరణకు ఉన్న అవకాశాలను వివరించారు. మానవ వనరులకు కొరతే లేదని ఎక్స్‌ వేదికగా తెలిపారు. అటు కేరళ(Kerala) సైతం కన్నడ పరిశ్రమలకు గాలం వేసింది.


వెనక్కి తగ్గిన సిద్ధూ సర్కార్
ఊహించని స్థాయిలో పారిశ్రామికవర్గాల నుంచి వ్యతిరేకతరావడంతో  సిద్ధరామయ్య ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి ఈ  బిల్లును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బిల్లు రూపకల్పన దశలోనే ఉందన్న సిద్ధరామయ్య వచ్చే కేబినెట్‌లో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.