కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ప్రైవేటు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారిణి డి.రూప తన ఫేస్ బుక్ ఖాతాలో రోహిణి సింధూరికి చెందిన ఫొటోలను షేర్ చేశారు. వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో పోస్టింగ్ వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.


కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే సా.రా. మహేష్ భూ కబ్జాకు పాల్పడ్డారని ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి చాలా నెలల క్రితం ఆరోపించారు. దీనికి ఎమ్మెల్యే మహేష్ కూడా స్పందిస్తూ వివరణ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య అప్పట్లో జరిగిన గొడవ యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొద్ది రోజులుగా చల్లారిపోయిన ఈ కేసు ఇప్పుడు కొత్త రూపం దాల్చింది.


రోహిణి సింధూరికి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి డి.రూప సోషల్ మీడియాలో ఓ పోస్టు చేస్తూ.. ‘‘ఇలాంటి చిత్రాలు మామూలుగా అనిపించవచ్చు. కానీ, ఒక మహిళా ఐఏఎస్ అధికారి.. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మగ ఐఏఎస్ ఆఫీసర్లకు ఒకరి నుంచి ఒకరికి ఇలా ఎన్నో ఫోటోలు తరచూ షేర్ చేస్తుంటే అర్థం ఏమిటి? ఇది ఆమె ప్రైవేట్ విషయం కాదు, ఐఏఎస్ సర్వీస్ కండక్ట్ రూల్స్ ప్రకారం నేరం. ఏ దర్యాప్తు సంస్థ అయినా ఈ ఫోటోల వాస్తవికతను కూడా విచారణ చేయవచ్చు. కొందరికి ఇది మామూలుగా అనిపించవచ్చు. పంపిన సందర్భం మరోలా ఉంది’’ అని తన పోస్ట్‌లో డి.రూప రాశారు.


ఇప్పటికీ రోహిణి సింధూరి, సా.రా. మహేష్ విషయంలో రోహిణిపై డి.రూపా ఆరోపణల వర్షం కురిపించింది. ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ఎమ్మెల్యే సా.రా. మహేష్ ని కలవడానికి ఎందుకు వెళ్ళింది? అని అడిగింది. డీకే రవి, రోహిణి సింధూరి చాటింగ్ ల గురించి కూడా రూపా ప్రస్తావించింది.


వివరణ ఇచ్చిన రోహిణి


ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి తన ఫొటోలను ముగ్గురు మగ ఐఏఎస్ అధికారులకు పంపినట్లు ఐపీఎస్ అధికారిణి డి రూప మౌద్గిల్ ఆదివారం విడుదల చేయడంతో కర్ణాటకలోని అధికార వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. ఐఏఎస్ సింధూరిపై, ఐపీఎస్ డి.రూప శనివారం 19 ఆరోపణలు చేసింది.


వివరణ ఇచ్చిన రోహిణీ సింధూరి 
రోహిణీ సింధూరి ఆదివారం (ఫిబ్రవరి 19) ఒక మీడియా ప్రకటనను విడుదల చేశారు. రూప తనకు వ్యతిరేకంగా "తప్పుడు, వ్యక్తిగత దూషణల ప్రచారాన్ని నడుపుతోంది", ఇది "ఆమె ప్రామాణిక పద్ధతి" అని పేర్కొంది. ఆ ప్రకటనలో "భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద ఆమె దుష్ప్రవర్తన, క్రిమినల్ నేరాలకు సంబంధించిన చర్యలకు గానూ నేను చట్టపరమైన, ఇతర చర్యలు తీసుకుంటాను" అని పేర్కొంది.


“ఆమె నా పరువు తీసేందుకు సోషల్ మీడియా నుండి ఫోటోలు, (నా) వాట్సాప్ స్టేటస్ స్క్రీన్‌షాట్‌లను సేకరించింది. నేను ఈ చిత్రాలను కొంతమంది అధికారులకు పంపానని ఆమె ఆరోపించినందున, వారి పేర్లను వెల్లడించాలని నేను ఆమెను కోరుతున్నాను”అని సింధూరి అన్నారు. అయితే, ఈ వ్యవహారం గురించి విలేకరులు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను అడిగినప్పుడు "ఈ సమస్య వారి వ్యక్తిగతమైనది" అని అన్నారు.