Karnataka CM Siddaramaiah: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో కన్నడ మాతృ భాషా సమగ్రాభివృద్ధి (సవరణ) ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఇప్పుడు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, సంస్థలకు ఏర్పాటు చేసే ‘సైన్‌బోర్డ్‌లు’ అలాగే నేమ్‌ప్లేట్లలో 60 శాతం కన్నడ భాషను ఉపయోగించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28వ తేదీలోపు దుకాణాల యజమానులు కన్నడ భాషలో దుకాణం పేర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. కన్నడ నిబంధనను పాటించని వ్యాపారాల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.


కర్ణాటక రక్షణ వేదిక పేరుతో ఆందోళనలు
గత కొద్ది కాలంగా కర్ణాటకలో భాషా వివాదం రగులుతోంది. 60 శాతం ‘క‌న్నడ‌’ పేరుతో కర్ణాటక రక్షణ వేదిక (టీఏ నారాయణ గౌడ వర్గం) ఓ ఉద్యమం తెర‌మీదికి తీసుకొచ్చింది. కర్నాటకలో వ్యాపారాలు నిర్వహించేవారు, దుకాణాల ముందు ఇంగ్లిష్‌లో సైన్ బోర్డుల‌ ఏర్పాటు చేయడంతో క‌న్నడ భాష అంత‌రించే ప్రమాదం ఉంద‌ంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. వాణిజ్య వ్యాపార సంస్థల సైన్ బోర్డుల‌పై ’60శాతం కన్నడ’ అక్షరాలే ఉండాలన్న నిబంధనను అమలు చేయాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. ఇందులో భాగంగా గత కొద్ది కాలంగా పలు చోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయి.


ఈ క్రమంలోనే నేమ్‌ బోర్డుల విషయంలో టీఏ నారాయణగౌడ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. అయితే బెంగళూరులో క‌ర్ణాట‌క ర‌క్షణ వేదిక‌ నిర్వహించిన ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌తోపాటు పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు.. హోటళ్లు, దుకాణాలపై ఆంగ్లంలో ఉన్న సైన్‌బోర్డుల‌ను తొలగించి విధ్వంసం సృష్టించారు. కన్నడలో సైన్‌బోర్డుల‌కు సంబంధించి బెంగళూరు నగర పాలక సంస్థ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఆయా ఘటనల్లో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. క‌ర్ణాట‌క ర‌క్షణ వేదిక‌ నేతలను అరెస్ట్‌ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించింది. 


రాష్ట్రంలో ఆందోళనలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్‌ అయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేదిలేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కర్నాటకలో సైన్ బోర్డులు, నేమ్‌ప్లేట్లలో 60 శాతం కన్నడలో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఫిబ్రవరిలోగా మార్పులు చేయాలని షాపుల యజమానులను ఆదేశించామని చెప్పారు. ఉత్తర్వులు అమలయ్యేందుకు ఒక ఆర్డినెన్స్‌ను కూడా తీసుకొస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సైన్‌బోర్డ్‌లు, నేమ్‌ప్లేట్లలో 60 శాతం కన్నడ భాషను ఉపయోగించాలనే ఆర్డినెన్స్‌కు కర్ణాటక సర్కార్ ఆమోద ముద్ర వేసింది.


ఉద్యామాల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదిలేదని సీఎం సిద్ధరామయ్య వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన వ్యక్తం చేయొచ్చని, ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలని కోరవచ్చన్నారు, అంతా కానీ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించబోమని హెచ్చరించారు. కన్నడ పరిరక్షణ పేరిట ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. రాష్ట్ర భాషను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కన్నడ కోసం పోరాడుతోన్న వారికి తాము వ్యతిరేకం కాదని, కానీ విధ్వంసానికి పాల్పడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.