Basavaraj Bommai Detained: కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం కొనసాగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని నిరసనకు దిగిన మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని మాజీ సీఎం బొమ్మై అసెంబ్లీ వెలుపల నిరసన తెలిపారు. పోలీసులు హెచ్చరించినా బీజేపీ నేతలు వెళ్లకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు ఇతర నేతలను పోలీసులు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ బొమ్మై అసహనం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని విమర్శించారు.
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కాసేపటికే బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. బీజేపీ నిరసనల మధ్యే కాంగ్రెస్ ప్రభుత్వం పలు బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు BJP ఎమ్మెల్యేలు డిప్యుటీ స్పీకర్పై పేపర్లు విసిరారు. వెంటనే బౌన్సర్లు వచ్చి వాళ్లను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ గందరగోళం కారణంగా సభ వాయిదా పడింది. డిప్యుటీ స్పీకర్పై పేపర్లు విసిరిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష నేతల కోసం ఐఏఎస్ అధికారులను దుర్వినియోగం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
IAS అధికారులను ప్రతిపక్ష నేతలతో భేటీ కావాలని ఉసిగొల్పి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. బడ్జెట్పై చర్చ కొనసాగుతుందని, లంచ్ బ్రేక్ ఇవ్వలేమని డిప్యుటీ స్పీకర్ రుద్రప్ప లమని తేల్చి చెప్పడమూ ఈ ఆందోళనలకు కారణమైంది. భోజనం చేయాలనుకునే వాళ్లు వెళ్లి రావచ్చని చెప్పారు రుద్రప్ప. అయితే..దీనిపై అసహనం వ్యక్తం చేసిన బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. 30 మంది IAS అధికారులను కాంగ్రెస్ మిత్రపక్ష నేతలకు సర్వెంట్లుగా మార్చేశారని ఆరోపించారు. తీవ్ర ఆగ్రహంతో డిప్యుటీ స్పీకర్పై పేపర్లు విసిరారు. "ఏ రూల్ ఆధారంగా లంచ్ బ్రేక్ రద్దు చేశారో చెప్పండి" అంటూ నినదించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి Join Us on Telegram: https://t.me/abpdesamofficial
