Karnataka Assembly Election 2023:


మరో నాలుగు రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. క్యాంపెయినింగ్ చివరి దశలో ఉండగా కాంగ్రెస్ మేనిఫెస్టోతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. బజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ బీజేపీకి కలిసొచ్చింది. ఇదే అంశాన్ని పట్టుకుని కాషాయ పార్టీ బాగా ప్రచారం చేసుకుంది. స్వయంగా ప్రధాని మోదీ కూడా పరోక్షంగా దీనిపై వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్ణాటక ఎన్నికలపై అందరి ఆసక్తి పెరిగింది. మరి ప్రజాభిప్రాయం ఎలా ఉంది..? కన్నడిగులు కాంగ్రెస్‌కు పట్టం కడతారా..? లేదంటే బీజేపీకే సపోర్ట్ చేస్తారా..?  దీనిపైనే ABP CVoter Opinion Pollలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గతంలోనే ఈ పోల్ నిర్వహించగా...కాంగ్రెస్‌కే అధికారం దక్కుతుందని వెల్లడైంది. ఈ సారి ఫలితాలు ఎలా వచ్చాయో చూద్దాం.


కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్.. 


కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 నియోజకవర్గాలున్నాయి. 113 సీట్లు నెగ్గే పార్టీ, లేక కూటమి అధికారంలోకి వస్తుంది. ABP CVoter Opinion Poll తాజా సర్వే ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి కనిష్టంగా 73 సీట్లు, గరిష్టంగా 85 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కనిష్టంగా 110 సీట్లు, గరిష్టంగా 122 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి రానుంది. జేడీఎస్ పార్టీ 21 నుంచి 29 సీట్లు నెగ్గనుండగా, ఇతరులు 2 నుంచి 6 స్థానాల్లో గెలుపొందనున్నారని తాజా సర్వేలో తేలింది.


కర్ణాటకలో పార్టీలకి ఓట్ల శాతం అంచనా..
మొత్తం సీట్లు 224
బీజేపీ - 36 శాతం
కాంగ్రెస్ - 40 శాతం
జేడీఎస్ - 16 శాతం
ఇతరులు - 08 శాతం


మొత్తం 73,774 మంది నుంచి అభిప్రాయాలు సేకరించిన ABP CVoter ప్రజానాడి ఏంటో వెల్లడించింది. ప్రభుత్వ పనితీరుపై సర్వే చేపట్టగా... బాగుంది అని 29% మంది చెప్పగా...పరవాలేదని 21%, బాలేదని 50% మంది చెప్పారు. ఇక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రోగ్రెస్ రిపోర్ట్‌ కూడా ఈ పోల్స్‌లో తేలింది. ముఖ్యమంత్రి పని తీరు బాగుందని 26% మంది తేల్చి చెప్పగా.. పరవాలేదని 24% మంది వెల్లడించారు. 50% మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాని మోదీ పనితీరుపైనా ప్రజల అభిప్రాయాలు సేకరించగా... 48% బాగుందని చెప్పగా... పరవాలేదని 19% మంది తెలిపారు. బాగోలేదని 33% మంది స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుండాలన్న విషయంపైనా సర్వే చేపట్టింది ABP CVoter. ప్రస్తుత సీఎం బసవరాజు బొమ్మైకి 31% మంది మొగ్గు చూపారు. ఇక కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్దరామయ్య ఉండాలని కోరుకుంటున్న వాళ్లు 42% మంది ఉన్నారు. ఇక జేడీఎస్‌కు చెందిన కుమారస్వామికి 21%, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు 3% మార్కులు పడ్డాయి. 


ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేమిటో కూడా ఈ పోల్స్‌లో వెల్లడైంది. నిరుద్యోగ రేటు 31% మేర ప్రభావం చూపనుందని తేలింది. మౌలిక వసతుల అంశం 27%, వ్యవసాయ రంగ సమస్యలు 15%, అవినీతి అంశాలు 9% మేర ప్రభావం చూపనున్నట్టు వెల్లడైంది. శాంతి భద్రతల ప్రభావం కేవలం 3%కే పరిమితమైంది. విజయావకాశాలు ఏ పార్టీకి ఎక్కువగా ఉన్నాయో సర్వే చేపట్టగా... కాంగ్రెస్‌కు 44% మంది మొగ్గు చూపారు. బీజేపీకి 32% మంది సానుకూలంగా స్పందించారు. జేడీఎస్‌కి 15% మంది ఓటు వేశారు. హంగ్ వచ్చే అవకాశాలు 4% మేర ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది.


గ్రేటర్ బెంగళూరు రీజియన్‌లో మొత్తం 32 సీట్లున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసే ఈ ప్రాంతంలో విజయావకాశాలు కాంగ్రెస్‌కే ఎక్కువగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. కాంగ్రెస్‌కు 41% మంది మొగ్గు చూపారు. బీజేపీకి 37% మేర విజయావకాశాలున్నట్టు వెల్లడైంది. ఇక జేడీఎస్‌కి 15% మేర ఓట్లు దక్కాయి. కీలకమైన ఓల్డ్ మైసూర్‌లో 55 నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ ఓటు షేర్‌పై సర్వే చేయగా...కాంగ్రెస్‌కు 35%, బీజేపీకి 25%, జేడీఎస్‌కి 33% మేర ఓట్లు దక్కుతాయని తేలింది.  ఇక సీట్ల ప్రకారం చూస్తే ఓల్డ్ మైసూర్‌లో బీజేపీకి 4-8 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలింది. కాంగ్రెస్‌కు 24-28, జేడీఎస్‌కి 19-23 సీట్లు దక్కనున్నట్టు వెల్లడైంది. గ్రేటర్‌ బెంగళూరులో బీజేపీకి 12-16 సీట్లు, కాంగ్రెస్‌కు 14-18 సీట్లు, జేడీఎస్‌కి 1-4 సీట్లు దక్కనున్నాయి. 


సెంట్రల్ కర్ణాటకలో మొత్తం 35 సీట్లున్నాయి. వీటిలో ఓటు శాతం వారీగా చూస్తే కాంగ్రెస్‌కు 42%, బీజేపీకి 37%,జేడీఎస్‌కి 12% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. సీట్ల పరంగా చూస్తే సెంట్రల్ కర్ణాటకలో బీజేపీకి 10-14, కాంగ్రెస్‌కు 20-24, జేడీఎస్‌కి 0-2 సీట్లు వస్తాయని ABP CVoter Opinion ఒపీనియన్  పోల్‌లో తేలింది. కోస్టల్ కర్ణాటకలో మొత్తం 21 సీట్లున్నాయి. ఓటు షేర్‌ల వారీగా చూస్తే ఇక్కడ కాంగ్రెస్‌కు 37%, బీజేపీకి 46% ఓట్లు దక్కనున్నట్టు వెల్లడైంది. జేడీఎస్‌కి 8% ఓట్లు రానున్నట్టు అంచనా. ఇక సీట్‌ల వారీగా పరిశీలిస్తే కోస్టల్ కర్ణాటకలో బీజేపీకి 13-17 సీట్లు, కాంగ్రెస్‌కు 4-8 సీట్లు దక్కనున్నట్టు వెల్లడైంది. జేడీఎస్‌ ఇక్కడ ఖాతా తెరిచే అవకాశాలు కనిపించడం లేదు.


ముంబయి కర్ణాటకలో 50 నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ బీజేపీకి 42%, కాంగ్రెస్‌కు 43%, జేడీఎస్‌కి 7% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. సీట్ల పరంగా చూస్తే...బీజేపీకి 22-26 సీట్లు, కాంగ్రెస్‌కు 24-28 సీట్లు దక్కనున్నట్టు ఈ సర్వేలో తేలింది.  హైదరాబాద్ కర్ణాటకలో మొత్తం 31 నియోజకవర్గాలున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీకి 38 శాతం, కాంగ్రెస్ కు 45 శాతం, జేడీఎస్- 10 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని ఒపీనియన్ పోల్ లో వచ్చింది. 


క‌ర్ణాట‌క‌ ఎన్నికల్లో (Karnataka Election 2023 Date) 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు నాలుగోవంతు ఉన్న‌ 51 రిజర్వ్‌డ్ స్థానాలు  కీలక పాత్ర పోషిస్తాయి. అత్యధిక రిజర్వ్‌డ్ స్థానాలను గెలుచుకున్న పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గ‌త ఎన్నిక‌లు నిరూపించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్ప‌డిన‌ ప్రతిసారీ, బీజేపీతో పోలిస్తే రిజర్వ్‌డ్ సీట్ల సంఖ్య పరంగా దాని పనితీరు మెరుగ్గా ఉంది. 2008లో య‌డియూరప్ప‌ నేతృత్వంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటుచేసిన‌ప్పుడు, 51 రిజ‌ర్వ్‌డ్‌ స్థానాల్లో 29 స్థానాల‌ను ఆ పార్టీ గెలుచుకుంది, కాంగ్రెస్ 17 కైవసం చేసుకుంది. 2013లో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ రిజర్వ్‌డ్ స్థానాల్లో 27 గెలుచుకుంది. బీజేపీకి కేవలం ఎనిమిది స్థానాల‌కు మాత్రమే ప‌రిమిత‌మైంది.


గత సర్వేలో ఏముంది..? 


కర్ణాటకలోని నియోజకవర్గాలను సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటక, గ్రేటర్ బెంగళూరు, హైదరాబాద్ కర్ణాటక, ముంబయి కర్ణాటక, ఓల్డ్ మైసూర్‌గా విభజించి చూస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ABP CVoter సర్వే చేపట్టింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా చూసి కొన్ని అంచనాలు వెలువరించింది. వీటి ఆధారంగా చూస్తే...గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38% ఓట్లు దక్కాయి. ఈ సారి అది 40%కి పెరిగే అవకాశాలున్నాయి. ఇక బీజేపీ విషయానికొస్తే...గత ఎన్నికల్లో 36% ఓట్లు రాబట్టుకుంది. ఈ సారి 34.7%కే పరిమితమయ్యే అవకాశమున్నట్టు ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఇక మరో కీలక పార్టీ JDSకి గత ఎన్నికల్లో 18% ఓట్లు సాధించింది. ఈ సారి 17.9% వరకూ సాధించే అవకాశముంది. ఇతర పార్టీలకు 7.3% ఓట్లు దక్కనున్నట్టు అంచనా వేసింది. 


సీట్ల పరంగా చూస్తే... గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు వచ్చాయి. బీజేపీ 104 చోట్ల విజయం సాధించింది. జేడీఎస్ 37 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆ తరవాత బీజేపీ చేతుల్లోకి అధికారం మారిపోయింది. అయితే...ప్రస్తుత అంచనాల ప్రకారం చూస్తే...కాంగ్రెస్‌కు 121 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 74,JDSకి 29 సీట్లు దక్కనున్నట్టు ఈ సర్వేలో తేలింది. మొత్తంగా చూస్తే...కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు, బీజేపీకి 68 నుంచి 80,JDSకి 23 నుంచి 35 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.