Jharkhand Fire Accident: జార్ఖండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ధన్ బాద్ బ్యాంక్ మోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హజ్రా క్లినిక్ లో శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వైద్య దంపతులు సహా ఆరుగురు మృతి చెందారు. వీరంతా ఊపిరాడక మరణించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. మరో తొమ్మిది మందిని ఆస్పత్రి నుంచి రక్షించినట్లు వెల్లడించారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా స్టోర్ రూంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ముందుగా కింది అంతస్తులో ప్రమాదం సంభవించగా.. ఈ మంటలు ఒకటో అంతస్తుకు వ్యాపించాయని.. దీంతో అక్కడ నిద్రిస్తున్న వ్యక్తులు తమను తాము రక్షించుకునే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు.


మృతులను డాక్టర్ వికాస్ హజ్రా, అతని భార్య డాక్టర్ ప్రేమ హజ్రా, యజమాని మేనల్లుడు సోహన్ ఖమారి, ఇంటి పని మనిషి తారాదేవి, మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన వైద్య దంపతులు తన కుటుంబంతో కలిసి ఆస్పత్రి ఫస్ట్ ఫ్లోర్ లో నివసిస్తున్నారు. ఆసుపత్రి, నివాస భవనం ఒకటే. అయితే అర్ధరాత్రి దాటాక అందరూ గాఢ నిద్రలో ఉండగా.. ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో వారికి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అని భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఆస్పత్రిలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని సిబ్బంది వివరించారు. 


ఇటీవలే హైదరాబాద్ లో ప్రమాదం - ముగ్గురు సజీవ దహనం


సికింద్రాబాద్‌లోని మినిస్టర్‌ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అందులో ముగ్గురు గల్లంతు అయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారి ఆచూకీ మాత్రం లోపల కనుగొనలేకపోయారు. అయితే, వీరు ముగ్గురు సజీవ దహనం అయినట్లుగా తాజాగా గుర్తించారు. వారి మృత దేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరు బిహార్‌కు చెందిన ముగ్గురు కూలీలు జునైద్‌, వసీం, అక్తర్‌ అని గుర్తించారు. ఆచూకీ లభ్యంకాని కూలీల సెల్‌ఫోన్‌ లోకేషన్‌ ను ట్రేస్ చేయగా వారు మంటలు చెలరేగిన భవనంలోనే ఉన్నట్లు చూపించింది.


తొలుత గల్లంతు అయిన కూలీల ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు కొనసాగించారు. కూలీల ఆచూకీ కోసం భారీ క్రేన్‌ సాయంతో బయట నుంచి భవనంలోని పై అంతస్తుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. 12 గంటల పాటు విపరీతంగా మండిన మంటల వల్ల భవనం పూర్తిగా దెబ్బతిన్నందున గాలింపు పూర్తయ్యాక భవనం మొత్తాన్ని కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. మంటల ధాటికి ఆరు అంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. భవనంలో 12 గంటలకు పైనే భారీ అగ్నికీలలు ఉన్నాయి. దాంతో లోపలికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అగ్నిప్రమాద సహాయ చర్యల్లో పాల్గొని అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడీఎఫ్‌వో ధనుంజయ రెడ్డితో పాటు ఫైరింజన్‌ డ్రైవర్‌ నర్సింగరావు గురువారం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.