JDU Seeks Special Category Status For Bihar: కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) తాజాగా కేంద్రానికి గట్టి మెలిక పెట్టారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కోరుతూ జనతాదళ్ (యునైటెడ్) జాతీయ కార్యవర్గ సమావేశంలో శనివారం తీర్మానించారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ (Special Status) లేదా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని తీసుకొచ్చిన తీర్మానాన్ని ఆ పార్టీ ఆమోదించింది. అలాగే, ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో అక్రమాలు నివారించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక, కఠిన చట్టం చేయాలని తీర్మానించింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాకముందే తమ డిమాండ్లను నితీశ్ కుమార్ మోదీ సర్కారు ముందు ఉంచుతున్నారు. అయితే, ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని గతంలోనే కేంద్ర పెద్దలు స్ఫష్టం చేసిన క్రమంలో.. మళ్లీ నితీశ్ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంలో కీలకంగా ఉన్న ఆయన డిమాండ్‌పై ఇప్పుడు మోదీ సర్కారు ఎలా స్పందిస్తుందో అనేది ఉత్కంఠగా మారింది.


మూడో అతి పెద్ద పార్టీగా..


బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఆ రాష్ట్ర కేబినెట్ గతేడాది ఓ తీర్మానాన్ని నవంబరులో ఆమోదించింది. అయితే, అప్పటికీ నితీశ్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఈ ఏడాది జనవరిలో ఈ కూటమి నుంచి వైదొలగిన సీఎం.. మళ్లీ బీజేపీ గూటికి చేరారు. తాజాగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో.. 12 మంది సభ్యుల బలంతో కూటమిలో మూడో అతి పెద్ద పార్టీగా  జేడీయూ అవతరించింది. ఈ క్రమంలోనే 'ప్రత్యేక హోదా' అంశాన్ని లేవనెత్తడంపై అంతటా ప్రాధాన్యత సంతరించుకుంది. 'బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, సవాళ్లు, సమస్యలను పరిష్కరించడంతో ఇది కీలక దశ' అని జేడీయూ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అటు, ఇదే సమావేశంలో పార్టీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా సీనియర్ నేత సంజ్‌ఝాను ఎన్నుకొన్నారు.


ఏపీ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి.?


2014లో ప్రత్యేక రాష్ట్రం విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని విభజన తీర్మానంలో పొందుపరిచింది. అయితే, ఆ తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు (NDA Government) ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కాగా, దేశంలో ప్రత్యేక హోదా సాధనకు ఏపీ, బిహార్ రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. గతంలో కేంద్రంలో ఎన్డీయే కూటమిలో బీజేపీకి సొంతంగా బలం ఉండడంతో ఈ డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీయే సర్కారు మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో ఏపీ నుంచి టీడీపీ, బీహార్ నుంచి జేడీయూలు కీలకంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నితీశ్ కేంద్రం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. మరి ఈ డిమాండ్‌పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.


 ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ సీఎం చంద్రబాబుపై (CM Chandrababu) ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కారులో ఆయన కూడా కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఈసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే డిమాండ్ ఆయనపై మళ్లీ బలంగా వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై ఒత్తిడి పెంచే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.