Land On Moon: చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవలే పెద్దపల్లికి చెందిన సాయి విజ్ఞత తన తల్లి మీద ఉన్న ప్రేమతో చంద్రుడిపై స్థల కొనుగోలు చేసి గిఫ్ట్‌గా అందించారు. తాజాగా జమ్మూకు చెందిన ఓ వ్యక్తి చంద్రుడిపై స్థలం కొనుగోలు చేశారు.  గస్టు 23న చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన నేపథ్యంలో, జమ్మూకు చెందిన వ్యాపారవేత్త, విద్యావేత్త రూపేష్ మాసన్ (49) ఆగస్టు 25న చంద్రునిపై స్థలం కొనుగోలు చేశారు. 


జమ్మూ కశ్మీర్ లేహ్  UCMAS ప్రాంతీయ డైరెక్టర్ అయిన మాసన్, లూనా ఎర్త్స్ మూన్, ట్రాక్ట్ 55-పార్సెల్ 10772 లాకస్ ఫెలిసిటాటిస్ (లేక్ ఆఫ్ హ్యాపీనెస్)లో ప్లేస్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. న్యూయార్క్ నగరంలోని లూనార్ రిజిస్ట్రీ నుంచి ప్లేస్‌ను కొనుగోలు చేశానని, ఆగస్టు 25న ధృవీకరించినట్లు మాసన్ చెప్పారు. చంద్రునిపై స్థలాన్ని పొందాలనే ఆలోచనలు మన తపనను ప్రతిబింబిస్తాయన్నారు. దాదాపు 675 మంది సెలబ్రిటీలు, ముగ్గురు అమెరికా మాజీ ప్రెసిడెంట్‌లకు చంద్రుడిపై స్థలాలు ఉన్నాయని ఆయన చెప్పారు.


చంద్రుడిపై స్థలం ఎలా కొంటారంటే
చంద్రుడిపై స్థలం కొనుగోలు చేయడానికి ప్రత్యేక విధానం ఉంది. అక్కడ స్థల విక్రయాలు చేయాలి అనుకునే వారు లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్‌‌ను సందర్శించాల్సి ఉంటుంది. స్థలం కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ సహా పలు ప్రాంతాలు ఉంటాయి. ముందుగా మీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను పొందాలి.


ఎకరా రూ.35 లక్షలకు పైనే
లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్‌‌ ప్రకారం చంద్రుడిపై ఎకరానికి రూ. 35 లక్షలకుపైనే ధర ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి అక్కడ జీవరాశి బతికే అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, చాలా మంది అక్కడ స్థలం కొనుగోలు చేస్తున్నారు. చంద్రుడి మీద కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. బాలీవుడ్‌ నటులు షారుఖ్ ఖాన్, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇప్పటికే అక్కడ స్థలం కొన్నారు.


అమ్మకు ప్రేమతో పెద్దపల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని GM కాలనీకి సింగరేణి ఉద్యోగి సుద్ధాల రాంచందర్‌, వకుళదేవి దంపతులు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు సుద్దాల సాయి విజ్ఞత పదేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్‌ కిమ్‌ రెనాల్స్‌ వద్ద ప్రాజెక్టు మేనేజర్‌గా, ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌గా పని చేస్తున్నారు. ఓ సారి తన కార్యాలయంలో చంద్రుడిపై స్థలం కొనుగోలు విషయమై ఓ సారి చర్చకు వచ్చింది. చాలా కాలంగా తల్లికి అరుదైన గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్న సాయి విజ్ఞతకు వెంటనే ఆలోచన వచ్చింది. చంద్రునిపై ప్లేస్‌ను కొని తన తల్లికి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది.


మదర్స్ డే సందర్భంగా 2022 మార్చి 8న చంద్రుడిపై ఒక ఎకరం జాగాను కొనుగోలుకు లూనార్‌ రిజిస్టేషన్‌ ద్వారా దరఖాన్తు చేసుకుంది. ఈ నెల 23న వకుళ, ఆమె మనుమరాలు ఆర్త సుద్దాల పేరుపై చంద్రుడిపై ఒక ఎకరం ప్లేస్‌ను రిజిస్టేషన్‌ జరిగింది. చిన్నప్పుడు చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపించిన తల్లికి ఏకంగా అక్కడే ఎకరా కొనేసింది. చంద్రయాన్‌-3 విజయవంతం అయిన రోజునే రిజిస్టేషన్‌ పత్రాలు చేతికందాయి. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది.


తన తల్లికి ఎవరు ఇవ్వని బహుమతి ఇవ్వాలనేది తన కోరిక అని, ఎట్టకేలకు తన కోరిక నెరవేరిందని సాయి విజ్ఞత ఆనందాన్ని వ్యక్తం చేసింది. చంద్ర మండలంలో తన పేరుపై కూతురు సాయి విజ్ఞత భూమి కొనుగోలు చేయడంపై తల్లి వకుళ, తండ్రి రాంచందర్‌ ఆనందంలో ముగినిపోయారు. తమ సంతోషాన్ని మాటల్లో చెప్పలేమని ఉబ్బితబ్బిబ్బయిపోయారు.