ఆన్ లైన్ గేమింగ్ కు వ్యతిరేకంగా....ఆందోళనలు మిన్నంటుతున్నాయ్. మొన్న షారుక్ ఖాన్ ఇంటి ముందు నిరసనకు దిగితే...తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మహారాష్ట్రలోని ప్రహర్ జన్ శక్తి పార్టీ ఎమ్మెల్యే బాబురావు ఆలియాస్ బచ్చు కాడు...తన అనుచరులతో కలిసి సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు నిరసనకు దిగాడు. ఆన్ లైన్ గేమ్స్ కు సచిన్ ఎండార్స్ మెంట్లు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాటింగ్ టు బెట్టింగ్ బ్యానర్లు ప్రదర్శిస్తూ...టెండూల్కర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆన్ లైన్ గేమ్ ల ప్రచారం నుంచి వెంటనే వైదొలగాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు...బచ్చు కాడు, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకొని బాంద్రా స్టేషన్ కు తరలించారు. అక్కడ కూడా బచ్చు కాడు అనుచరులు తగ్గలేదు...బాంద్రా పోలీస్ స్టేషన్ లోనూ ఆందోళనకు దిగారు. 


టెండూల్కర్ కు 3వందల కోట్లు కావాలనుకుంటే...ఆన్ లైన్ గేమ్స్ కు ప్రచారం చేయవచ్చన్నాడు ఎమ్మెల్యే బచ్చుకాడు. ఎండార్స్ మెంట్లే కావాలనుకుంటే...కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భారతరత్న అవార్డును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో బచ్చు కాడు...మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటికైనా ఆన్ లైన్ గేమ్స్ ప్రచారాన్ని మానుకోకపోతే...న్యాయ పరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే బచ్చు కాడు వార్నింగ్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు సైతం...టెండూల్కర్ ఆన్ లైన్ గేమ్స్ ప్రచారంపై లేఖ రాశారు. డబ్బు కోసం ఆన్ లైన్ గేమింగ్ ను ఎండార్స్ మెంట్ల్ చేయాలనుకుంటే...వెంటనే భారతరత్నను తిరిగి ఇచ్చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  


కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇంటి ముందు...అన్ టచ్ యూత్ ఫౌండేషన్ ఆందోళనకు దిగింది.  ఏ23 అనే ఆన్ లైన్ రమ్మీ పోర్టల్ సంస్థ...షారుక్ ఖాన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. ఏ 23 గేమ్స  ప్లాట్ ఫామ్...షారుక్ ఖాన్ తో ప్రొమో షూట్ చేసి విడుదల చేసింది. చలో సాథ్ ఖేలో అంటూ షారుక్ ఖాన్  ప్రొమోలో చెప్పారు. ఆన్ గేమింగ్ ప్లాట్ ఫాంలకు షారుక్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంపై...అన్ టచ్ యూత్ ఫౌండేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ23, జంగ్లీ రమ్మీ, జుపీ లాంటి ఆన్ లైన్ గేమింగ్స్ యువతను పాడు చేస్తున్నాయని...అలాంటి వాటిని ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించారు.


సచిన్ టెండూల్కర్...24 ఏళ్లు సుదీర్ఘ కెరీర్ ఎన్నో అసాధారణమైన రికార్డులను నెలకొల్పాడు. స‌చిన్ టెండూల్క‌ర్  పేరు లేకుండా ఇండియ‌న్ క్రికెట్ ప్ర‌స్థానాన్ని, ఘ‌న‌త‌ల్ని చెప్ప‌లేము. సొగ‌సైన ఆట‌తీరుతో ఇండియ‌న్ టీమ్‌కు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాల్ని అందించాడు. దిగ్గ‌జ క్రికెట‌ర్లు సొంతం చేసుకోలేని ఎన్నో  రికార్డుల‌ను తన పేరుతో లిఖించుకున్నాడు. అంతర్జాతీయ  క్రికెట్‌లో వంద సెంచ‌రీలు సాధించిన ఏకైక బ్యాటర్ స‌చిన్ మాత్ర‌మే. టెస్టుల్లో 51 సెంచరీలు, వ‌న్డేల్లో 49 సెంచ‌రీల‌ను స‌చిన్ సాధించాడు. ఆస్ట్రేలియాపై 20 సెంచ‌రీలు చేసిన ఏకైక బ్యాటర్ స‌చిన్ ఒక్క‌డే. శ్రీలంక, ద‌క్షిణాఫ్రికాల‌పై ప‌దికిపైగా సెంచ‌రీలు సాధించాడు. ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రికెట్‌లో అత్య‌ధిక ఫోర్లు కొట్టిన ఏకైన బ్యాటర్ కూడా మాస్టర్ బ్లాస్టరే. క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్లలో ఒకరుగా సచిన్ టెండుల్కర్ గుర్తింపు పొందారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ పేరిటే ఉంది. వన్డేల్లో 18,426 పరుగులు, టెస్ట్ మ్యాచ్‌లలో 15,921 పరుగులు సాధించాడు మాస్టర్ బ్లాస్టర్. తాను ఆడిన ఏకైక టీ20 మ్యాచ్‌లో సచిన్ 10 పరుగులు సాధించాడు.