J&K Firing: 



అనంత్‌నాగ్‌లో కాల్పులు..


జమ్మూ కశ్మీర్ లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఉగ్రవాదులు దాడుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ ఎదురు కాల్పులు చేస్తున్న క్రమంలో ఆర్మీ కల్నల్ మన్‌ప్రీత్‌ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్‌చక్‌, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ హుమాయున్ భట్ లు అమరులయ్యారు. లష్కరే తోయిబాకు చెందిన షాడో గ్రూప్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇండియన్ ఆర్మీ. అనంత్‌నాగ్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే మరోసారి కాల్పులు, బాంబు పేలుళ్లు సంభవించాయి. అనంత్‌నాగ్‌లో తలదాచుకున్న ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టినట్టు ఆర్మీ స్పష్టం చేసింది. జవాన్లను బలి తీసుకున్న ఆ టెర్రరిస్ట్‌లను మట్టుబెట్టేందుకు చూస్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులయ్యారని, ఇందుకు కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఆర్మీ వెల్లడించింది. ఈ దాడులపై జమ్ములో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాదులే ఈ పని చేశారని, పాక్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఆందోళనకారులు. జమ్ములో భారతీయ జనత యువ మోర్ఛ ఆందోళన చేపట్టింది. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌పై దాడికి నిరసనగా నినాదాలు చేసింది. ఉగ్రవాదుల దిష్టిబొమ్మల్ని తగల బెట్టింది. అమరుల కుటుంబ సభ్యులు ఈ ఘటనను తట్టుకోలేకపోతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. 










కుటుంబ సభ్యులు కల్నల్ సింగ్‌ని తలుచుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. ఉదయమే తాము కాల్ చేసి మాట్లాడామని, మళ్లీ కాల్ చేస్తా అని వెంటనే కాల్ కట్ చేశాడని చెప్పారు. గతేడాది సేనా మెడల్ అందుకున్నాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. అమర జవాన్లకు ఆర్మీ అధికారులు నివాళులు అర్పించారు.