Violence Breaks Out In Manipur: మణిపూర్లో హింస మళ్లీ మొదలైంది. ఇంఫాల్ లోయ ప్రాంతంలో హింసాత్మక నిరసనలతోపాటు భద్రతా సిబ్బందితో నిరసనకారులు ఘర్షణలకు దిగినట్లు సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు పలు నిబంధనలు విధించారు. ఐదు రోజుల పాటు కీలక లోయ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ తోపాటు డేటా సేవలను నిలిపివేశారు. ఘర్షణలు ఎక్కువగా చెలరేగుతున్న బిష్ణుపూర్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. తూర్పు ఇంఫాల్, పశ్చిమ ఇంఫాల్, తౌబాల్ తోపాటు కాచింగ్ జిల్లాల్లో 144 సెక్షన్ పెట్టి పలు నిషేధాజ్ఞలు విధించింది. ఈ విషయాన్ని మణిపూర్ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X వేదికగా శనివారం అర్ధరాత్రి తెలియజేశారు. ఈ నిషేధాజ్ఞలు వెంటనే అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజా ప్రశాంతతను కాపాడుకోవడానికి సస్పెన్షన్ అవసరమైన చర్యసోషల్ మీడియా ద్వారా ద్వేషపూరిత ప్రసంగం, వీడియోలతో సహా రెచ్చగొట్టే కంటెంట్ను ప్రసారం చేసే అవకాశం ఉందని, అందుకే ‘సామాజిక వ్యతిరేక అంశాలు’ ప్రజల్లోకి వెళ్లకుండా ఇంటర్నెట్ సేవలను బంద్ చేసినట్లు రాష్ట్ర కమిషనర్, హోం కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సామాజిక వ్యతిరేక అంశాలు అశాంతికి దారితీస్తుంది వెల్లడించారు. ‘ప్రాణనష్టం లేదా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తికి నష్టాన్ని నివారించడానికి, మతసామరస్యం, ప్రజా ప్రశాంతతను కాపాడుకోవడానికి సస్పెన్షన్ అవసరమైన చర్య’ అని ఆ ఉత్తర్వులో పేర్కొంది.
పోలీస్ అవుట్పోస్ట్పై సామూహిక దాడిమెయిటీ గ్రూపు అరంబై టెంగోల్కు చెందిన ఐదుగురు సభ్యులతోపాటు దాని కమాండర్లలో ఒకరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వ్యాపించిన నేపథ్యంలో మహిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. ప్రతీకారంగా ఆందోళనకారులు ఓ పోలీస్ ఔట్పోస్ట్లో దాడి చేశారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. దీంతో జనసమూహాన్ని చెదరగొట్టేందుకు భద్రతా దళాలు అనేక రౌండ్లు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో అక్కడి పరిస్థితులను కవర్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులతో సహా మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
తప్పుడు వార్తలను వ్యాప్తి చేయొద్దుపరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు, పారామిలిటరీ దళాలను ప్రభుత్వం మోహరించింది. ప్రజలు బయటకు రావొద్దని, ఇంటి లోపలే ఉండాలని వెల్లడించారు. తప్పుడు వార్తను వ్యాప్తి చేయకుండా ఉండాలని, సంయమనం పాటించాలని ప్రభుత్వం కోరింది.