INS MRSAM : భారత నేవీ మీడియం రేంజ్ మిస్సైల్ విజయవంతంగా ప్రయోగించింది. భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించగల మిస్సైల్ ను భారత నేవీ ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (MRSAM) ఫైరింగ్‌ను విజయవంతంగా చేపట్టింది. DRDO, IAI సంయుక్తంగా అభివృద్ధి చేసిన MRSAM ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో తయారుచేశారు. ఆత్మనిర్భర భారత్ లో భాగంగా భారత నౌకాదళం ఈ మిస్సైల్ ను రూపొందించింది.  ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల డీఆర్డీవో వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. 


పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన 


ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తో కలిసి డీఆర్డీవో...భారత్ డైనమిక్స్ లో ఈ మిసైల్ ని తయారుచేసింది. ఈ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్టు డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 5న అరేబియా సముద్రంలో నిర్వహించిన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగం కూడా విజయవంతమైందని నేవీ వర్గాలు తెలిపాయి. తాజాగా మీడియం రేంజ్ క్షిపణిని భారత ఆర్మీ, వైమానికదళం కూడా వినియోగించుకోవచ్చునని వెల్లడించాయి.  ఈ మిస్సైల్ రేంజ్ 70 కిలో మీటర్లు అని తెలుస్తోంది. ఈ క్షిపణి శత్రుదేశాల విమానాలను, డ్రోన్లను, హెలీకాఫ్టర్లను కూడా కూల్చివేయగలదని డీఆర్డీవో పేర్కొంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ క్షిపణిని రూపొందించినట్లు నేవీ వర్గాలు వెల్లడించాయి.






బ్రహ్మోస్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం 


భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్ ను రెండ్రోజుల క్రితం భారత నేవీ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. అరేబియా సముద్రంలో మోహరించిన కోల్ కతా శ్రేణి యుద్ధనౌక నుంచి గాల్లోకి దూసుకెళ్లిన బ్రహ్మోస్ లక్ష్యాన్ని ఛేదించిందని భారత నౌకాదళం ప్రకటించింది. దీనిలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సీకర్‌ అండ్‌ బూస్టర్‌లను ఉపయోగించినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. సీకర్‌ బూస్టర్‌లను డీఆర్‌డీవో రూపొందించింది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ పట్ల తమ నిబద్ధతను ఈ ప్రయోగం మరింత బలపరుస్తోందని నేవీ పేర్కొంది. భారత్‌-రష్యా  దేశాలు సంయుక్తంగా బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులను రూపొందిస్తున్నారు. వీటిని జలాంతర్గాములు, నౌకలు, విమానాల నుంచి కూడా ప్రయోగించేందుకు వీలుగా తయారుచేస్తున్నారు. ఈ బ్రహ్మోస్‌ క్షిపణికి ధ్వని వేగానికి మూడురెట్ల వేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం ఉంది. గతేడాది ఏప్రిల్‌లో భారత్‌ నేవీ, అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌తో కలిసి యాంటి షిప్‌ వెర్షన్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిస్‌ క్షిపణలను విజయవంతంగా ప్రయోగించింది. భారత్‌ బ్రహ్మోస్‌ మిస్సైల్స్ ను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది.