పశ్చిమ బెంగాల్‌లో, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) డిమాండ్ చేస్తున్నాయి. డీఏ పెంచేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ససేమిరా అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇవ్వడానికి రాష్ట్రంలో నిధులు లేవని అన్నారు. ఇంకా ఎక్కువ అడుగుతున్నారని, ఇంకా ఎంత ఇస్తామని ప్రశ్నించారు. 


ప్రతిపక్షాల మద్దతుతో చేస్తున్న నిరసనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ.. ‘‘ప్రభుత్వం ఎక్కువ డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) ఇవ్వడం సాధ్యం కాదు. మా వద్ద డబ్బు లేదు. మేము అదనంగా 3 శాతం డీఏ ఇచ్చాము. మీరు సంతోషంగా లేకుంటే మీరు నా తలను నరికివేయండి, మీకు ఇంకా ఎంత (DA) కావాలి?’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


రచ్చ ఎక్కడ మొదలైంది?
రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య ఫిబ్రవరి 15న అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పెన్షనర్లు సహా ఉద్యోగులకు మార్చి నుంచి ప్రభుత్వం 3 శాతం అదనపు డీఏ చెల్లిస్తుందని ప్రకటించారు. ఇప్పటివరకు, రాష్ట్రం బేసిక్ జీతంలో 3 శాతం డీఏగా చెల్లిస్తోంది. బడ్జెట్ ప్రకటనలో ఈ మార్చి నుండి ఉపాధ్యాయులు, పెన్షనర్లతో సహా ఉద్యోగులకు ప్రభుత్వం అదనంగా 3 శాతం డీఏ చెల్లిస్తామని ప్రకటించారు.


'ఏ ప్రభుత్వం ఇన్ని సెలవులు ఇస్తుంది?'


ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రసంగంలో వామపక్షాలు, బీజేపీని టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ డిమాండ్‌ను ఇరు పార్టీలు సమర్థిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల వేతన స్కేలు వేర్వేరుగా ఉన్నాయని, ఈ రోజు బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం ఒక్కటయ్యాయని, ఏ ప్రభుత్వం వేతనాలతో ఇన్ని సెలవులు ఇస్తోందని మమతా బెనర్జీ ప్రశ్నించారు.


'కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు పోలుస్తున్నారు?'
విపక్షాలపై విరుచుకుపడిన బెంగాల్ ముఖ్యమంత్రి, “నేను ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.79 లక్షల కోట్ల డీఏ చెల్లించాను, మేము 40 రోజుల వేతనంతో సెలవు ఇస్తున్నాము, మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో పోల్చారు? మేం ఉచిత బియ్యం ఇస్తున్నాము. ఇంతకుమించి మిమ్మల్ని సంతృప్తి పరచడానికి ఏం కావాలి? వంటగ్యాస్ ధర సంగతి ఏంటి? ఎన్నికల తర్వాత ఒక్కరోజులోనే ధర పెంచారు.’’ అని వ్యాఖ్యలు చేశారు.