భారత్ - కెనడా దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మరోసారి భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కెనడా దేశం తీవ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా మారిందని ఆరిందమ్ బాగ్చీ ధ్వజమెత్తారు. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని ఆక్షేపించారు. ఇక, భద్రతాపరమైన పరిస్థితుల కారణంగానే కెనడియన్లకు వీసా సర్వీసులను నిలిపివేసినట్లు వెల్లడించారు.


‘‘కెనడాలోని హైకమిషన్లు, కాన్సులేట్లు భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నాయి. వారు బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. అందువల్ల, హై కమిషన్, కాన్సులేట్ వీసా తాత్కాలికంగా వీసా సేవలను అందించలేకపోతున్నాయి. కెనడియన్లు భారత్‌కు రాకుండా అడ్డుకోవాలనేది మా విధానం కాదు. సరైన వీసాలతో (సస్పెన్షన్‌ ఉత్తర్వులకు ముందు జారీ అయిన వీసాలు) వారు ఎప్పుడైనా ఇండియాకు రావొచ్చు. కానీ, ఆ దేశంలోని పరిస్థితులు మన హైకమిషన్‌ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి.


నిజ్జార్ కేసుకు సంబంధించి అందించిన ఏదైనా నిర్దిష్ట సమాచారాన్ని పరిశీలించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అయితే కెనడా నుండి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని కెనడాకు భారతదేశం చెప్పింది. వారి దేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ, వారు దానిపై ఎలాంటి చర్య తీసుకోలేదు’’ అని ఆరిందమ్ అన్నారు.
 
కెనడాలోని భారత కాన్సులేట్ వద్ద భద్రతను పెంపొందించడంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. ‘‘భద్రత కల్పించడం ఆతిథ్య ప్రభుత్వ బాధ్యత అని మేం ఎల్లప్పుడూ నమ్ముతాం. కొన్ని ప్రదేశాలలో మా స్వంత భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కానీ, నేను దాని గురించి చర్చించడం ఇష్టం లేదు’’ అని అన్నారు.


కెనడాలో జరుగుతున్న నేరపూరిత పనులు, వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి అన్ని ఆధారాలను మేం ఆ దేశానికి ఇచ్చాం. గత కొన్నేళ్లుగా దాదాపు 20-25 మంది వ్యక్తులను భారత్ కు అప్పగించాలని కెనడాను కోరాం. వారు ఏ స్పందనా ఇవ్వలేదు. తీవ్రవాదులు, అతివాదులకు కెనడా స్వర్గధామంగా ఉంటోంది. అంతర్జాతీయంగా పోతున్న పరువు గురించి కెనడా ఆలోచించుకోవాలి’’ అని బాగ్చి తేల్చి చెప్పారు.