Emergency Alert System India: భారత్‌ సొంత టెక్నాలజీతో విపత్తు హెచ్చరికల వ్యవస్థలను సిద్ధం చేస్తోంది. శనివారం జరిగిన ఈ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో మారుమోగాయి. అసలు ఈ వ్యవస్థ ఎందుకు అవసరం? ఎలా పని చేస్తుంది? అనే వివరాలు తెలుసుకుందాం. 

శనివారం 11 గంటలకు చాలా మంది మొబైల్ వినియోగదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారి ఫోన్‌లకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పెద్ద శబ్దంతో కూడిన బీప్‌లు, వైబ్రేషన్‌లతో కూడిన సందేశం వచ్చింది. ఫోన్ స్క్రీన్‌పై అత్యవసర సేవల అలర్ట్ అని ఇంగ్లీష్ తెలుగులో హెచ్చరికలు కనిపించాయి. అయితే ఇది చూసి భయపడాల్సిన పని లేదు. భారత్ ప్రభుత్వం తన కొత్త ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంలో భాగంగానే ఈ సందేశాలను పంపింది. 

Also Read: భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! సామాన్యులపై పెను భారం!

మొబైల్‌ ఫోన్‌లకు వచ్చిన ఆ సందేషం ఇలా ఉంది. భారత్‌ తన పౌరుల కోసం తక్షణ విపత్తు హెచ్చరిక సేవలను అందించేందుకు స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి సెల్ బ్రాడ్ కాస్ట్‌ను ప్రారంభించింది. అప్రమత్తమైన పౌరులే సురక్షితమైన దేశానికి ఆధారం. ఈ సందేశం అందిన తర్వాత ప్రజలు ఎటువంటి చర్య తీసుకోవాలని పని లేదు. ఇది కేవలం భారత్ ప్రభుత్వం పంపిన పరీక్ష సందేశం మాత్రమే" 

ఈ పని భారత్ ప్రభుత్వంలోని రెండు కీలక విభాగాలు సమన్వయం చేసుకుంటున్నాయి. టెలికమ్యూనికేషన్ల శాఖ టెక్నాలజీ సహకారం, మొబైల్ నెట్‌వర్క్‌ల ద్వారా సందేశాల పంపిణీ బాధ్యతను చూస్తుంది. నేషనల్‌ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ అథారిటీ విపత్తు నిర్వహణలో భాగంగా పౌరుల ప్రాణ , ఆస్తి నష్టాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ రెండు విభాగాలు కలిపి దేశవ్యాప్తంగా మొబైల్‌ ఆధారిత విపత్తు కమ్యూనికేషన్ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి. 

గతంలో సునామీలు , తుపాన్లు భూకంపాలు వచ్చినప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి రేడియోలు, టీవీ లేదా సాధారణ SMSపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే, విపత్తు సమయంలో నెట్‌వర్క్‌ జామ్ కావడం లేదా సమాచారం అందడంలో జాప్యం వల్ల ప్రాణం నష్టం ఎక్కువగా ఉండేది. ఈ వ్యవస్థతో సెకనుల వ్యవధిలోనే కోట్ల మందికి ఏక కాలంలో సమాచారాన్ని చేరవేయవచ్చు. సాధారణ SMSల వలె కాకుండా, ఇది సెల్ బ్రాడ్ కాస్ట్ టెక్నాలజీపై పని చేస్తుంది. దీని వల్ల నెట్‌వర్క్ రద్దీగా ఉన్నా సందేశం నేరుగా ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.  తుపాన్లు వరదలు, సునామీ వంటి విపత్తులు వచ్చేటప్పుడు ప్రజలను ముందుగా సురక్షితం ప్రాంతాలకు వెళ్లమని హెచ్చరించడానికి ఇది అద్భుతంగా పని చేస్తుంది. ఇది పూర్తిగా భారతీయ టెక్నాలజీతో తయారు చేశారు. దీని వల్ల భద్రత, నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది. 

ఈ వ్యవస్థ సెల్‌ బ్రాడ్ కాస్ట్ అనే టెక్నాలజీ ఉపయోగిస్తారు. మీరు ఇంటర్నెట్‌ ఆన్‌లో ఉంచకపోయినా మెసేజ్ వస్తుంది. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా కూడా  ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది. ఇది టెలికాం టవర్ల ద్వారా నిర్ణీత ప్రాంతాల్లోని మొబైల్ ఫోన్‌లన్నింటికీ ఎక కాకంలో సిగ్నల్ పంపుతుంది.