Vande Mataram at Red Fort: భారత్ స్వాతంత్య్ర సంగ్రామంలో లక్షల మంది వీరులను ఉత్తేజపరిచిన అమర గీతం వందేమాతరం. బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన ఈ నినాదం, ఇప్పుడు స్వతంత్ర భారత దేశ సార్వభౌమాధికార ప్రతీక అయిన ఎర్రకోట వేదికపై అధికారికంగా ప్రతి ధ్వనించింది. ఇప్పటి వరకు ఎర్రకోట వేడుకల్లో కేవలం జాతీయ గీతమైన జనగణమన కు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. కానీ 80వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు వందేమాతరం గీతాన్ని కూడా ప్రధాన ప్రోటోకాల్‌లో చేర్చి ఆలపించి సరికొత్త చరిత్రకు కేంద్రం శ్రీకారం చుట్టింది. 

Continues below advertisement

ఈ చారిత్రక నిర్ణయం వెనుక బలమైన నేపథ్యం ఉంది. బంకించంద్ర ఛటర్జీ 1875లో వందేమాతరం  గేయాన్ని రచించారు. 2026 నాటికి ఈ మహత్తర గేయం రూపుదిద్దుకుని 150 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఈ గేయం పాడినందుకు బ్రిటీష్ ప్రభుత్వం ఎందరో భారతీయులను జైలుకు పంపించింది. అటువంటి మహత్తర గీతానికి ఎర్రకోట వేదికపై అత్యున్నత గౌరవం కల్పించడం ద్వారా స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని ప్రభుత్వం భావన. 

సాధారణంగా ఎర్రకోటపై జరిగే కార్యక్రమాల్లో ఒక నిర్ధిష్ట క్రమం ఉంటుంది. అయితే ఈసారి ఆ క్రమంలో మార్పులు చేశారు. ప్రధాని మోదీ ఎర్రకోట ప్రాంగణంలోకి అడుగు పెట్టే సరికి అక్కడ వందేమాతరం గీతాన్ని ప్రత్యక్షంగా ఆలపించారు. అనంతరం ప్రధాని గౌరవ వందనాన్ని స్వీకరించి ఎర్రకోట బురుజుపైకి చేరుకున్నారు. ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వెంటనే జనగణమన గీతం వినిపించింది. అదే టైంలో భారత వైమానిక దళానికి చెందిన Mi-17 హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించింది. 

వందేమాతరం హ్యూమన్ ఆకృతి 

ఈ ఏడాది వేడుకల్లో మరో విజువల్ వండర్‌గా నిలిచిన మరో అంశం జ్ఞానపథ్‌. ఎర్రకోట ముందున్న మైదానంలో 2500 ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ యువ వాలంటీర్లు ప్రత్యేకంగా కూర్చున్నారు. వీరు ఆ మైదానంలో వందేమాతరం అనే హిందీ అక్షరాల ఆకృతిలో కూర్చొని అద్భుతమైన హ్యూమన్ ఫార్మేషన్ సృష్టించారు. డ్రోన్ కెమెరాల ద్వారా  విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు కనువిందు చేశాయి. 

ఈసారి వేడుకలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పేలా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం మార్పులు చేసింది. గతంలో ఉన్న వీఐపీ బోర్డులను తొలగించి, ఆయా సీటింగ్ బ్లాక్‌లకు భారత్‌లోని ప్రసిద్ధ సరస్సులు దాల్‌, చిల్కా, కొల్లేరు, హుస్సేన్ సాగర్ వంటి పేర్లు పెట్టారు. పర్యావరణహితంగా ఉండేందుకు కాగితపు పాస్‌లకు బదులుగా డిజిటల్‌ క్యూఆర్ కోడ్ ఆధారిత ఈ పాస్‌లను తీసుకొచ్చారు. వేడుకలకు హాజరయ్యే సాధారణ పౌరులకు ఢిల్లీ మెట్రో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. 

ఈ వేడుకలను అత్యున్నత సాంకేతికతతో 4k క్వాలిటీలో లైవ్ ప్రసారం చేశారు. వేడుకలు ముగిసిన తర్వాత స్వచ్ఛత ప్రచారం పేరుతో పరిసరాలను శుభ్రపరిచే ఎకో ఫ్రెండ్లీ కార్యక్రమాన్ని కూడా రక్షణ శాఖ ప్లాన్ చేసింది. ఈ వేడుకులకు FPOs, సర్పంచ్‌లు, గిరిజన కళాకారులు వంటి 5000 మందిని విశిష్ట అతిథులుగా ఆహ్వానించారు.