కర్ణాటకలో ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ మహిళా అధికారిణుల మధ్య పోరు రసవత్తరంగా మారింది. రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎన్నో వివాదాలతో గతంలో వార్తల్లో నిలిచిన రోహిణి సింధూరి ఇప్పుడు మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె పేరును సీనియర్ ఐపీఎస్ అధికారిణి డి.రూప వివాదంలోకి లాగారు. రోహిణి సింధూరికి 19 ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా రోహిణికి చెందిన ప్రైవేటు ఫొటోలను కూడా విడుదల చేసి ట్యాగ్ చేస్తూ సంచలనం రేపారు. దీనిపై రోహిణి సింధూరి కూడా ఘాటుగా స్పందిస్తూ న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. వివాదంలోకి వచ్చిన ఈ రోహిణి సింధూరి ఎవరు? అసలు ఆమె చుట్టూ నెలకొన్న వివాదాలు ఏంటి?


రోహిణి సింధూరి ఎవరు?


రోహిణి సింధూరి కర్ణాటక రాష్ట్రానికి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన, అంతే వివాదాల్లో చిక్కుకున్న IAS అధికారిణి. ఆంధ్రాకు చెందిన ఆమె 2009 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. రాష్ట్రంలోని హాసన్, మైసూర్ సహా పలు జిల్లాలకు కలెక్టర్‌గా పని చేశారు. రోహిణి సింధూరి ప్రస్తుతం రాష్ట్ర ముజరాయి శాఖ (Department of Religious and Charitable Endowments) కమిషనర్‌గా పని చేస్తున్నారు.


Also Read: IAS Vs IPS: కర్ణాటకలో ఐఏఎస్ Vs ఐపీఎస్, సోషల్ మీడియాలో తీవ్రంగా తగువులు - ఆమె ప్రైవేట్‌ ఫోటోలు విడుదల!


రోహిణి సింధూరికి రేవణ్ణతో గొడవ


గతంలో రోహిణి సింధూరి హాసన్ జిల్లాకి కలెక్టర్‌గా పనిచేశారు. అప్పటి మంత్రి హెచ్‌డీ రేవణ్ణతో రోహిణి సింధూరి గొడవకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేవణ్ణ, రోహిణి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మైసూర్‌కు రోహిణి సింధూరి డిప్యూటీ కమిషనర్ (డీసీ) గా ఉండగా కూడా రేవణ్ణ-రోహిణి మధ్య గొడవ ఉండేది. ఇద్దరూ పరస్ఫరం తానంటే తానే గొప్ప అనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసుకొనేవారు. 


గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రి ఎ. మంజు పట్టుబట్టడంతో, ఆమె బదిలీ అయ్యారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ప్రశ్నిస్తూ సింధూరి కేఏటీ, హైకోర్టును ఆశ్రయించారు. బదిలీపై స్టే విధించింది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలో అంతా తలకిందులైంది. జిల్లాలోని పలు కార్యక్రమాలు, సమావేశాల్లో జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మంత్రి రేవణ్ణ.. ఎట్టకేలకు ఆమెను జిల్లా నుంచి బదిలీ చేయడంలో సఫలీకృతులయ్యారు.


మైసూరులోనూ రోహిణి సింధూరి వివాదం


సెప్టెంబర్ 2020లో, రోహిణి సింధూరి మైసూర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆమె జూన్ 2021 వరకు ఈ పదవిలో కొనసాగారు, అప్పటి మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్‌తో కూడా ఈమెకు వివాదం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ మైసూర్ నుండి బదిలీ అయ్యారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వీరిద్దరినీ ట్రాన్స్‌ఫర్ చేసింది.


కరోనా సమయంలో కూడా వివాదం


చామరాజనగర్‌లో ఆక్సిజన్ కొరతతో 24 మంది కరోనా బారిన పడి మరణించడానికి మైసూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న రోహిణి సింధూరి సమయానికి ఆక్సిజన్ ఇవ్వకపోవడమే కారణమని చామరాజనగర్ జిల్లా కలెక్టర్ ఆరోపించారు. కరోనా నిర్వహణ కోసం డబ్బు ఖర్చు చేయడం కూడా వివాదాస్పదంగా ఉంది. ఇంకా ఆ నిధులకు జిల్లా కలెక్టర్‌ను బాధ్యులను చేయాలని ఎంపీ ప్రతాప్‌సింహ బహిరంగంగా డిమాండ్ చేశారు. ఈ సమయంలో మనీ అకౌంట్ రిలీజ్ చేశారంటూ ఎంపీలకు లంచాలు ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు.


మహేష్‌ సారాతో విభేదాలు


మైసూరులోని కేఆర్ నగర్ ఎమ్మెల్యే సా.రా. మహేష్‌తో రోహిణి సింధూరికి విభేదాలు వచ్చాయి. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, కోవిడ్‌ నేపథ్యంలో పనుల నిర్వహణ, నిజాయతీగా పని చేయకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని కప్పిపుచ్చేందుకే టెస్టింగ్ నంబర్లలో మరణాలు తక్కువగా చూపిస్తున్నారని సారా మహేష్ ఆరోపించారు. సారా మహేష్ అక్రమంగా భూములిచ్చారని రోహిణి సింధూరి చెప్పిన ఆడియో వైరల్‌గా మారింది. రోహిణి సింధూరిపై సారా మహేష్ పరువునష్టం కేసు కూడా పెట్టారు.


ప్రతాప్ సింహ-రోహిణి సింధూరి మధ్య యుద్ధం


కొడగు-మైసూరు ఎంపీ ప్రతాప్ సింహాతో రోహిణి సింధూరికి మధ్య గొడవలు ఉన్నాయి. మైసూరు జిల్లాలో కోరో మృతుల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉందని, దీంతో చాలా మందికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరిపై ఎంపీ ప్రతాప్ సింగ్ పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. మైసూర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ నివాసం ఒక వారసత్వ భవనం. అక్కడ కొత్త భవన నిర్మాణ పనులు జరపకూడదు. కానీ జిల్లా కలెక్టర్ గా ఉన్న రోహిణి సింధూరి దాదాపు రూ.50 లక్షల వ్యయంతో స్విమ్మింగ్ పూల్, జిమ్ నిర్మించారని ఆరోపించారు.


దీనిపై రోహిణి సింధూరి ప్రభుత్వానికి సమాధానం ఇచ్చారు. “జిల్లా కలెక్టర్ నివాస కార్యాలయ ఆవరణలో ఈత కొలను నిర్మించడం అనేది 5 సంవత్సరాల నాటి ప్రాజెక్ట్. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణ పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాక్టికల్ ప్రాజెక్ట్‌గా స్విమ్మింగ్ పూల్ నిర్మించాం’’ అని స్పష్టం చేశారు.


రూ.14 కోట్ల అవినీతి


రోహిణి సింధూరి చేనేత కార్పోరేషన్‌ను వదిలి ప్రైవేట్‌ వ్యక్తికి టెండర్‌ ఇవ్వడంతో లబ్ధి పొందారని ఎమ్మెల్యే సా.రా. మహేశ్ ఆరోపించారు. ఎకో ఫ్రెండ్లీ క్లాత్ బ్యాగుల కొనుగోలు పేరుతో మొత్తం రూ.14 కోట్ల అవినీతి ఉందని సా.రా. అన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని సా.రా. మహేశ్ డిమాండ్‌ చేశారు.


రోహిణి సింధూరికి సారా మహేష్ క్షమాపణ చెప్పారా?


ఈ వివాదం విషయంలో సింధూరి.. ఎమ్మెల్యే సా.రా. మహేష్‌కి రోహిణి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. సా.రా. మహేష్‌ని కలిసిన తర్వాత వాట్సాప్‌లో సుదీర్ఘ సందేశం పంపిన రోహిణి సింధూరి.. ఇది కేవలం తన డ్యూటీ అని, ఇందులో వ్యక్తిగతంగా ఏమీ లేదని వివరణ ఇచ్చినట్లు సమాచారం.


సింధూరి ఆధ్వర్యంలోనే ఎన్నో విప్లవాత్మక మార్పులు


ఇన్ని వివాదాలతో పాటు పరిపాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా రోహిణి సింధూరికే దక్కుతుంది. సింధూరి 2011 ఆగస్టు 29 నుంచి 2012 ఆగస్టు 31 వరకు తుమకూరులో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. తర్వాత ఆమె మొదటిసారి సివిల్ సర్వీస్‌కు ఎంపికైంది. అదే సమయంలో తుమకూరు పట్టణాభివృద్ధి శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా పనిచేసిన రోహిణి 2012 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగారు. పన్నుల వసూళ్లను కంప్యూటరీకరించడం, కార్పొరేషన్ భూములను స్వాధీనం చేసుకోవడం, రద్దీగా ఉండే రోడ్లపై కూడా విజయవంతంగా రహదారి పనులు చేపట్టడం, దాతృత్వ కార్యక్రమాల ద్వారా తుమకూరు ప్రజలు ఇప్పటికీ రోహిణిని గుర్తుంచుకుంటారు.


మరుగుదొడ్ల నిర్మాణంలోనూ రికార్డు


రోహిణి నేతృత్వంలో 2014లో ఒక్క ఏడాదిలోనే మాండ్య జిల్లాలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి రికార్డు సృష్టించారు. దేశంలో అత్యధిక మరుగుదొడ్లు ఉన్న మూడు జిల్లాల్లో మాండ్య కూడా ఒకటి. ప్రజలకు మరుగుదొడ్లు ఉన్నాయా లేదా అని ప్రతిరోజు ఉదయం గ్రామస్తులను కలుసుకునేవారు. 'ముంజనే' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు.


Also Read: IAS Vs IPS: కర్ణాటకలో ఐఏఎస్ Vs ఐపీఎస్, సోషల్ మీడియాలో తీవ్రంగా తగువులు - ఆమె ప్రైవేట్‌ ఫోటోలు విడుదల!