Harish Rana: భారత్ వైద్య , న్యాయ చరిత్రలో ఒక అత్యంత బాధాకరమైన కీలకమైన అధ్యాయం ముగిసింది. గత 13 ఏళ్లుగా కోమా స్థితిలో మంచానికే పరిమితమైన 31 ఏళ్ల హరీష్ రాణా మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం పాసివ్‌ యుథనేసియాకు అనుమతి ఇచ్చిన మొదటి వ్యక్తిగా హరీష్‌ రాణా చరిత్రలో నిలిచిపోయారు. 

ఘోర ప్రమాదం- ఆ పై 13 ఏళ్ల పోరాటం 

హరీష్ రాణా జీవితం 2013లో ఒక్కసారిగా తలకిందులైంది. అప్పట్లో పంజాబ్ యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్న హరీష్‌ చండీగఢ్‌లోని ఒక పేయింగ్ గెస్ట్ వసతి గృహం నాల్గో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడుకు తీవ్ర గాయమైంది. ఇప్పటి నుంచి ఆయన వెజిటేటివ్‌ స్టేట్‌ అంటే స్పృహ లేని స్థితిలోకి వెళ్లిపోయారు. సుదీర్ఘ కాలం పాటు కృత్రిమ శ్వాస కోసం ట్రాకియోస్టమీ ట్యూబ్‌, ఆహారం కోసం గ్యాస్ట్రోజెజునోస్టమీ ట్యూబ్‌ సహాయంతో ప్రాణాలు నిలబెట్టారు. 

ఘజియాబాద్‌లోని తన నివాసంలో తల్లిదండ్రుల ఆయనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అయితే పదేళ్లు గడిచినా ఆయన ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కోలుకునే అవకాశాలు లేవని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆ తల్లిదండ్రులు ఒక భారమైన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడికి నరకప్రాయమైన ఈ జీవితం నుంచి విముక్తి ప్రసాదించాలని కోరుతూ వారు న్యాయపోరాటం చేశారు. 

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు 

ఈ మార్చి 11న సుప్రీంకోర్టు హరీష్ రాణా కేసులో ఒక మైలురాయి వంటి తీర్పు వెల్లడించింది. గౌరవప్రదంగా మరణించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. గత 13 ఏళ్లుగా హరీష్‌ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదని వైద్యులు చెబుతున్నారు. చికిత్స కొనసాగించం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హరీష్‌కు పాసివ్‌ యుథనేసియా అమలు చేసేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

AIIMలో చివరి మజిలీ 

కోర్టు ఆదేశాల మేరకు మార్చి 14న హరీష్‌ ఘజియాబాద్‌లోని తన ఇంటి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పాలియేటివ్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. హరీష్ గౌరవానికి ఎటువంటి భంగం కలగుండా అత్యంత జాగ్రత్తగా చికిత్సను నిలిపివేయాలని కోర్టు సూచించింది. ఇందు కోసం వైద్యులు సీమా మిశ్రా నేతృత్వంలోని అనస్థీసియా, న్యూరో సర్జరీ సైకియాట్రీ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 

మార్చి 16 నుంచి వైద్య బృందం పర్యవేక్షణలో కృత్రిమ పోషకాహారం, ఇతర జీవన ఆధారిత వ్యవస్థలను తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. చివరకు 11 రోజుల తర్వాత మార్చి 24న సాయంత్రం 4.10 గంటలకు హరీష్‌ ప్రశాంతంగా కన్నుమూశారు. 

మరణంలోనూ మరొకరికి జీవం 

హరీష్ మరణించినా ఆయన అవయవాల ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన కుటుంబ సభ్యుల నిర్ణయించారు. హరీష్‌ కళ్లల్లోని కార్నియాలను, గుండె కవాటాలను దానం చేయడం ద్వారా ఆ కుటుంబం సమాజానికి మంచి సందేశం ఇచ్చింది. 

భారత్‌లో పాసివ్ యుథనేసియా ఎప్పుడో మొదలైంది 

భారత్‌లో పాసివ్ యుథనేసియా చట్టబద్ధమైన చర్చ దశాబ్దాల క్రితమే మొదలైంది. 2011లో అరుణా షాన్ బాగ్ కేసులో సుప్రీంకోర్టు పాసివ్ యుథనేసియాను కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది. అయితే అప్పట్లో అరుణా షాన్ బాగ్ విషయంలో ఆసుపత్రి సిబ్బంది అభ్యంతరం తెలపడంతో ఆమెకు అది అమలు కాలేదు. హరీష్ కేసు ద్వారా ఇప్పుడు దేశంలోనే మొదటిసారిగా ఒక రోగికి గౌరవప్రదమైన మరణాన్ని పొందే హక్కు ఆచరణలోకి వచ్చింది. ప్రభుత్వం పాసివ్ యుథనేసియాపై స్పష్టమైన చట్టాన్ని తీసుకురావాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది.