Goa: గోవాలో సునామీ సైరన్ కలకలం రేపింది. గోవాలో సునామీని రానున్నట్లు సైరన్‌ మోగడంతో తీర ప్రాంతంలో నివసించే ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఉత్తర గోవా జిల్లాలోని పోర్వోరిమ్‌ కొండపై ఈడబ్ల్యూడీఎస్‌ (EWDS)ను ఏర్పాటు చేశారు. ఇది సునామీ సంభవించడానికి ముందు విపత్తును పసిగట్టి సైరన్‌ ద్వారా హెచ్చరిస్తుంది. దీంతో ప్రజలు అప్రమత్తం అవడానికి అవకాశం ఉంది. దూరంగా వెళ్లడానికి, పారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది.


అయితే బుధవారం రాత్రి  పోర్వోరిమ్‌ కొండపై ఈడబ్ల్యూడీఎస్‌ (EWDS)ను ఏర్పాటు చేసిన సైరన్ మోగింది. కాసేపట్లో సునామీ రానున్నట్లు హెచ్చరిస్తూ మోగుతూనే ఉంది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. సునామి వస్తుందోమోనని భయంతో పరుగులు తీశారు. దాదాపు 20 నిమిషాలపాటు సైరన్‌ మోగుతూనే ఉంది. చాలా సేపటి తరువాత అది తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు ప్రజలు గ్రహించి ఊపిరి పీల్చుకున్నారు.


ఘటనపై జిల్లా కలెక్టర్‌ మము హేగే స్పందించారు. సైరన్‌ మోగుతోందని సమాచారం వచ్చిన వెంటనే ఈ విషయంపై సంబంధిత అధికారులతో చర్చించినట్లు చెప్పారు. భారత వాతావరణ శాఖ (IMD) నుంచి ఎలాంటి హెచ్చరికలు రాలేదని, సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే సైరన్‌ మోగిందన్నారు. సైరన్‌ మోగడానికి గల సరైన కారణాలను తెలపాలని  రాష్ట్ర జలవనరుల శాఖ (WRD)ని కలెక్టర్‌ కోరారు. 


‘సైరన్ మోగుతున్నట్లు మాకు సమాచారం అందింది. వెంటనే వాతావరణశాఖ అధికారులతో చర్చించాం. వారు ఎలాంటి హెచ్చరికలు రాలేదన్నారు. సాంకేతిక సమస్యలతోనే సైరన్ మోగినట్లు వారు చెప్పారు. సైరన్ మోగడానికి కారణాలు చెప్పాలని అధికారులను కోరాం’ అని కలెక్టర్ తెలిపారు. 


సైరన్ గురించి స్థానికలు మాట్లాడుతూ.. ‘రాత్రి భోజనం చేసి ఇంటి బయటకు వెళ్లాం. ఆ సమయంలో సైరన్‌ మోగింది. దీంతో మేమంతా ఎంతో భయాందోళనలకు గురయ్యాం. చాలాసేపు అది మోగుతూనే ఉంది. చాలా మంది భయంతో పరుగులు తీశారు. అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ సముద్రం నుంచి అలజడి లేదు. సైరన్‌ తప్పుడు హెచ్చరిక జారీ చేస్తోందని గ్రహించి ఊపిరి పీల్చుకున్నాం’ తెలిపారు.