బుధవారం తెల్లవారు జామున అండమాన్ నికోబార్ దీవులను భూకంపం వణికించింది. ఉదయం 5 :30 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. దీని తీవ్రత రిక్టార్‌ స్కేలు పై 5.0 గా నమోదు అయ్యింది.


ఇది భూమి లోపల 10 కిలో మీటర్ల లోతులో సంభవించడంతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు.


అండమాన్‌ దీవుల్లో కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపం రావడంతో ప్రజలు భయపడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఎటువంటి ప్రళయానికి ఇది సంకేతమో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు.


ఇంతకు ముందు జులై 29న అర్ధరాత్రి 12.53 గంటలకు ఈ అండమాన్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.8గా నమోదు అయ్యింది. ఈ భూకంపం 69 కిలోమీటర్ల లోతులో సంభవించిందని ఎన్సీఎస్ తెలిపింది.


ఏదైనా ముంపు వచ్చి పడితే ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఇప్పటికే అధికారులు ప్రజలకు సూచనలు ఇస్తున్నారు.