డ్రోన్ల ద్వారా భారతదేశ చిత్రపటాన్ని ఆకాశంలో చెక్కారు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ సుందర దృశ్యం ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో జరిగింది. దీన్ని తిలకించేందుకు ఎంతో మంది జనం తరలివచ్చారు. భారతదేశంలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం రాజ్‌పథ్‌లో భారత సంస్కృతి, సైనిక పటిమను దేశమంతా తిలకించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పగటిపూట, అందమైన టేబుల్‌లాక్స్ ప్రజలను ఆకర్షించింది. ఇదిలా ఉండగా సాయంత్రం 'విజయ్ చౌక్' వద్ద డ్రోన్‌ల సందడి మొదలైంది. భారతదేశం మ్యాప్, మహాత్మా గాంధీ చిత్రంతో సహా అనేక విషయాలు ఆకాశంలోనే చెక్కారు. సుమారు 10 నిమిషాల పాటు, ఈ డ్రోన్ల షో సాగింది. ఒకదాని వెంట మరొకటి డ్రోన్లు చేస్తున్న విన్యాసాలకు సంబంధించి మనోహరమైన దృశ్యాన్ని ప్రజలు కన్నార్పకుండా చూశారు. 


ఈ డ్రోన్ల ప్రదర్శన విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కొద్ది రోజుల క్రితమే వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. చైనా, రష్యా, బ్రిటన్ తర్వాత వెయ్యి డ్రోన్‌లతో ఇంత పెద్ద ఎత్తున ప్రదర్శనను నిర్వహించిన నాలుగో దేశంగా భారతదేశం అవతరించిందని అన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ మద్దతుతో, ఇంకా ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటైన ఓ స్టార్ట్-అప్ ద్వారా ఈ డ్రోన్ల షోను ఆపరేట్ చేశారు. బాట్లాబ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకమైన 'డ్రోన్ షో'ను రూపొందించింది. ఆ డ్రోన్ షో వీడియోను మీరూ చూడండి


మరోవైపు, గణతంత్ర దినోత్సవం రోజున చూసిన భారతదేశ సైనిక శక్తి, అనేక వైమానిక దళ విమానాలు రాజ్‌పథ్‌లో తమ విన్యాసాలు ప్రదర్శించాయి. వైమానిక దళం ఫైటర్ జెట్‌లు విభిన్న నిర్మాణాలను ప్రదర్శించాయి. ఇందులో రాఫెల్, సుఖోయ్, జాగ్వార్, ఎంఐ-17, అపాచీ హెలికాప్టర్లు కనిపించాయి. ఇందులో చాలా విమానాలు కలిసి ప్రదర్శించారు. మేఘన, ఏకలవ్య, బాజ్, తిరంగా, విజయ్ మరియు ముఖ్యంగా అమృత్ వంటి అనేకం దర్శనమిచ్చాయి. చివరికి, వైమానిక దళానికి చెందిన 75 విమానాలు కలిసి ప్రయాణించాయి. మొత్తానికి ఢిల్లీలోని రాజ్‌ పథ్‌లో గణతంత్ర దినం సందర్భంగా దేశం యొక్క సమర్థత, బలంతో పాటు సంస్కృతి కనిపించింది.