ఉగ్రవాదులు మరోసారి ఉగ్రకుట్రకు ప్లాన్ చేశారు. భారత్‌లో విధ్వంసం చేసేందకు ఈసారి డ్రోన్లను తమ మార్గంగా ఎంచుకుని జమ్మూకాశ్మీర్‌లోకి పంపించారు. కతువా జిల్లా
 రాజ్‌బాగ్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భారత్ వైపు దూసుకొచ్చిన ఓ డ్రోన్‌ను కూల్చివేశారు. మన భద్రతా సిబ్బంది డ్రోన్ ను కూల్చివేసి ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారని సమాచారం. ఆ డ్రోన్‌లో ఏడు బాంబులు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. 


ఉగ్రవాదుల టార్గెట్ ఏంటంటే..
అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు తమ ప్లాన్‌లో భాగంగా డ్రోన్లను పంపించి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. భారీ ఉగ్రవాద కుట్రలో భాగంగా డ్రోన్ల ద్వారా భారత సరిహద్దులోకి బాంబులను పంపి పేల్చివేసే ప్రయత్నం జరగగగా భద్రతా సిబ్బంది అప్రమత్తమై సకాలంలో డ్రోన్‌ను కూల్చివేశారు. ఆ డ్రోన్‌లో ఏడు అండర్ బారెల్ గ్రెనేడ్‌లు ఉన్న మరో ప్యాకెట్ ఉన్నట్లు గుర్తించారు.






అమర్‌నాథ్ యాత్రికులపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని సమాచారంతో భద్రతా సిబ్బంది కథువా జిల్లాలో నిఘా ఉంచింది. రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తల్లి హరియా చక్ ప్రాంతంలో బార్డర్ నుంచి ఓ డ్రోన్ అనుమానాస్పదంగా రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై దాన్ని కూల్చివేశారు. ఇందులో పేలుడు పదార్థాలతో ఉన్న స్టికీ బాంబులను గుర్తించిన భద్రతా సిబ్బంది షాక్‌కు గురయ్యారు. డిస్పోజల్ స్క్వాడ్ డ్రోన్‌ను పరిశీలిస్తోంది.


జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఏమన్నారంటే..
కథువా జిల్లాలోని రాజ్‌భాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తల్లి హరియా చక్ ప్రాంతంలో పే లోడ్‌తో ఓ డ్రోన్ సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన తమ సిబ్బంది చాకచక్యంగా డ్రోన్‌ను కూల్చివేసి బాంబు నిర్వీర్యం చేసే టీమ్‌కు సమాచారం అందించగా వారు వచ్చి చెక్ చేసినట్లు చెప్పారు. 7 స్టికీ మాగ్నటిక్ బాంబులను స్వాధీనం చేసుకున్నామని కథువా ఎస్ఎస్‌పీ వెల్లడించారు. సరిహద్దు ప్రాంతంలో ఇలాంటి దాడులు గతంలో ఏమైనా జరిగాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.


Also Read: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా