Temple wall collapse in Parbhani, Maharashtra | ముంబై: మహరాష్ట్రలోని పర్బానీ జిల్లాలోని ఓ ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో గర్బగుడి ముందు నిర్మాణంలో ఉన్న మండపం పైకప్పు కూలి భక్తులపై పడింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని పరభణి జిల్లా మానవత్ తాలూకాలోని యశవాడిలోని హనుమాన్ ఆలయంలో శనివారం (20 జూన్) పెద్ద ప్రమాదం జరిగింది. ప్రసిద్ధ హనుమాన్ ఆలయ గర్భగుడి ముందు నిర్మాణంలో ఉన్న సభా మండపం పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో 7 గురు భక్తులు మరణించగా, 32 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే యంత్రాంగం తక్షణమే సహాయక, రెస్క్యూ చర్యలను ప్రారంభించింది. శనివారం కావడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు భారీ సంఖ్యలో హనుమాన్ దర్శనానికి వస్తుంటారు. ఘటనా స్థలంలో పలు అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. మెడికల్ బృందాలను కూడా తీసుకొచ్చారు. జిల్లా అధికారులు, పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఆలయంలో విషాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..మహారాష్ట్రంలోని పర్బానీ జిల్లాలో హనుమాన్ ఆలయంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మహారాష్ట్రలోని పరభణిలో గోడ కూలి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది’ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
