Delhi Air Pollution:


మళ్లీ వర్షాలు..? 


దాదాపు వారం రోజులుగా ఢిల్లీ ప్రజల్ని కాలుష్యం (Delhi Air Pollution) ఉక్కిరిబిక్కిరి చేసింది. బయటకు రావాలంటేనే అంతా వణికిపోయారు. స్కూల్స్‌ మూతపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకున్నారు. అటు ప్రభుత్వం కూడా కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ లోగా వర్షం కురవడం వల్ల ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటికీ AQI "Poor" కేటగిరీలోనే ఉన్నప్పటికీ మునుపటితో పోల్చుకుంటే కొంత వరకూ ఊరట లభించింది. Central Pollution Control Board (CPCB) లెక్కల ప్రకారం...ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Delhi AQI) 279గా నమోదైంది. వర్షం కారణంగానే గాలి నాణ్యత పెరిగిందని అధికారులు వెల్లడించారు. హాట్‌స్పాట్‌గా ఉన్న ఆనంద్ విహార్‌లో AQI 282గా నమోదైంది. RK పురంలో 220, పంజాబీ బాగ్‌లో 236,ITO ప్రాంతంలో 263గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఈ AQI 437 వరకూ ఉంది. అయితే... India Meteorological Department అంచనాల ఆధారంగా చూస్తే...ఇవాళ కూడా (నవంబర్ 11) వర్షం కురిసే అవకాశముంది. చాలా చోట్ల వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశాలున్నాయని IMD వివరించింది. ఢిల్లీలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ స్పందించారు. 


"వర్షం పడిన తరవాత వాతావరణం కాస్త అదుపులోకి వచ్చింది. గాలులు కూడా వీస్తున్నాయి. ఈ కారణంగానే కాలుష్యం దాదాపు 50% వరకూ తగ్గిపోయింది. అంతకు ముందు AQI 450 వరకూ వెళ్లింది. ఇప్పుడది 225కి  మెరుగైంది. ఎన్ని రోజుల వరకూ ఈ వర్ష ప్రభావం ఉంటుందన్నది చెప్పలేం"


- గోపాల్ రాయ్, ఢిల్లీ పర్యావరణ మంత్రి






ఢిల్లీ కాలుష్యంపై (Pollution in Delhi) సుప్రీంకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సమయంలో కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ప్రభుత్వంపై మండి పడింది. పొరుగు రాష్ట్రాల్లో వరిగడ్డిని కాల్చడాన్ని (Stubble Burning) కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటే తప్ప ఏ చలనమూ ఉండడం లేదని ఫైర్ అయింది. ప్రతి ఏడాది ఇదే జరుగుతోందని తెలిపింది. కాలుష్యంలో 24% మేర వాటా గడ్డి కాల్చడం వల్లేనని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.


"ఏటా కాలుష్య సమస్య వెంటాడుతూనే ఉంది. అయినా సరే మేం జోక్యం చేసుకుంటే కానీ మీలో చలనం కనిపించడం లేదు. పొరుగు రాష్ట్రాల్లో వరి గడ్డి కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతోంది. మొత్తం కాలుష్యంలో దీనిదే 24% వాటా ఉంది. బొగ్గు, ఫ్లై యాష్ కారణంగా 17% మేర కాలుష్యం నమోదవుతోంది. వాహనాల ద్వారా 16% గాలి కలుషితమవుతోంది. ఇదంతా తెలియంది కాదు. అయినా సరే కోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలిచ్చేంత వరకూ ఏ చర్యలూ తీసుకోకుండా ఎదురు చూస్తున్నారు. సరిబేసి విధానం అమలు చేయాలా వద్దా అన్నది కోర్టుకి వదిలేయకండి. ఆ భారాన్ని కోర్టుపై వేయకండి"


- సుప్రీంకోర్టు 


Also Read: రాజస్థాన్‌లో దారుణం,నాలుగేళ్ల బాలికపై SI అత్యాచారం - బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి