Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో నేడు కీలక పరిణామం ఒకటి చోటు చేసుకోనుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ED) ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేస్తారంటూ ఆప్‌ ప్రచారం చేస్తోంది.


ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలో ఈ కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఢిల్లీ ముఖ్యమంత్రికి సమన్లు ​​జారీ చేసింది.  రూ.338 కోట్ల మనీ ల్యాండరింగ్‌పై విచారణ చేసినట్లు న్యాయమూర్తులు తెలిపారు. ఈ కేసులో ఏప్రిల్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేజ్రీవాల్‌ను ప్రశ్నించింది. ఆ తరువాత ఆయనకు ఈడీ సమన్లు ​​పంపడం ఇదే తొలిసారి. 


కేజ్రీవాల్‌కు సమన్లు ​​జారీ చేయడంపై ఆప్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా నాశనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకుందని, అందుకోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందన్నారు. అందులో భాగంగానే దొంగ కేసులు పెడుతోందని విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపి ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనేది కేంద్రం ఆలోచన అంటూ ధ్వజమెత్తారు.


కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తాయని భరద్వాజ్ చెప్పుకొచ్చారు. అదే జరిగితే ఆప్ ప్లాన్ బి సిద్ధంగా ఉందా అని ఆయనను అడిగినప్పుడు, ప్రస్తుతానికి, తనకు తెలియదని, దాని గురించి చర్చించలేదన్నారు. కేజ్రీవాల్ తమ నాయకుడని ఆయన సారధ్యంలో పని చేస్తామన్నారు. మరో మంత్రి అతిషి సైతం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవచ్చనే వ్యాఖ్యలు చేశారు. ఆయనను ప్రశ్నించిన తర్వాత కస్టడీలోకి తీసుకుంటారని చెప్పారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆధారంగా ఒక్క ఆధారం లేదని, కేవలం బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.


ఇండియా కూటమిలోని పలువురు సభ్యులు కేజ్రీవాల్‌కు సమన్లు ఇవ్వడాన్ని ఖండించారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందనడానికి ఇది నిదర్శనం అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఈ అంశంపై మాట్లాడుతూ..  ఎన్నికలకు ముందు, ప్రతిపక్ష పార్టీల గొంతును అణచి వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకులందరిని అరెస్టు చేసి భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలు లేకుండా అధికారం కోసం వారు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. 


కేజ్రీవాల్ అరెస్ట్ జరిగితే లిక్కర్ స్కాం కేసులో కస్టడీకి గురైన ఆప్‌కి చెందిన మరో సీనియర్ నేత అవుతారు. ఫిబ్రవరిలో మనీష్ సిసోడియా అరెస్టు అయ్యారు. రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను గత నెలలో అరెస్ట్ చేశారు. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కూడా గతేడాది మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. 


ఆప్ వాదనలను బీజేపీ ఖండించింది. స్కామ్‌లు, అవినీతి, అక్రమాలతో ఆప్ తన చరిత్రను ముగించుకుంటోందని బీజేపీ నేతలు అన్నారు. కేజ్రీవాల్ ఆమోదం లేకుండా మద్యం పాలసీ కేసు వంటి భారీ కుంభకోణం జరగదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని, చట్టపరమైన ప్రక్రియను అనుసరిస్తున్నామని బీజేపీ పేర్కొంది.