Cyclone Biparjoy: 


సిద్ధమైన ఎన్‌డీఆర్ఎఫ్..


గుజరాత్ తీరాన్ని తాకి విధ్వంసం సృష్టిస్తున్న బిపార్‌జాయ్ తుపాను...ఇప్పుడు రాజస్థాన్‌వైపు దూసుకెళ్తోంది. సౌత్ రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని IMD వెల్లడించింది. ఇప్పటికే గహ్లోట్ సర్కార్ తుపానుని ఎదుర్కోటానికి సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు చేస్తోంది. NDRF బృందాలు తీర ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నాయి. దీనిపై NDRF డీజీ అతుల్ కర్వాల్ కీలక వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు టీమ్స్‌ని రెడీ చేస్తున్నట్టు చెప్పారు. అటు కర్ణాటకలోనూ తుపాను కొంత మేర ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. 


"తుపాను గుజరాత్‌ తీరాన్ని తాకింది. ఇప్పుడు గుజరాత్‌వైపు దూసుకొస్తోంది. దక్షిణ గుజరాత్‌లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఇప్పటికే మేం సిద్ధమయ్యాం. జాలోర్‌ ప్రాంతానికి ఓ టీమ్‌ని పంపించాం. కర్ణాటకలోనూ నాలుగు టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రలోనూ మా బృందాలు సహాయక చర్యలకు సిద్ధమవుతున్నాయి"


- అతుల్ కర్వాల్, ఎన్‌డీఆర్‌ఎఫ్ డీజీ






ఈదురు గాలులు, భారీ వర్షాలతో గుజరాత్‌ని అతలాకుతలం చేసింది ఈ తుపాను. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ధాటికి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా...23 మంది తీవ్రంగా గాయపడ్డారు. 


"గుజరాత్‌లో తుఫాను కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 23 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాదాపు వెయ్యి గ్రామాల్లో కరెంట్‌ లేదు. తాగు నీరు కూడా అందుబాటులో లేదు. 800 చెట్లు నేల కూలిపోయాయి. ఒక్క రాజ్‌కోట్‌లో తప్ప అన్ని చోట్లా భారీ వర్షాలు కురుస్తున్నాయి"


- అతుల్ కర్వాల్, ఎన్‌డీఆర్‌ఎఫ్ డీజీ


కచ్‌లో నష్టం ఎక్కువగా వాటిల్లింది. రెండు హైవేస్‌ని మూసేశారు. గంటకు 115-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కొన్ని రైళ్లనూ రద్దు చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే ప్రకటించింది. కచ్‌లోని మాండ్వి, మోర్బిలోని మలియా ప్రాంతాల్లో చెట్లన్నీ కూలిపోతున్నాయి. కరెంట్ స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 


"బలమైన గాలులు వీస్తుండటం వల్ల కరెంట్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. మలియాలో దాదాపు 45 గ్రామాలకు విద్యుత్ సరఫరా కట్ అయిపోయింది. 9 గ్రామాల్లో విద్యుత్‌ని రీస్టోర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మిగతా చోట్ల కూడా వీలైనంత త్వరగా విద్యత్ సరఫరాను పునరుద్ధరిస్తాం. గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. 200 కరెంట్ స్తంభాలు,250 చెట్లు కూలిపోయాయి. ఇక్కడి ప్రజల్ని షెల్టర్ హోమ్స్‌కి తరలించాం. దాదాపు 52 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాం. 25వేల పశువులనూ తరలించాం"


- అధికారులు


Also Read: ధైర్యం ఉంటే మా క్యాడర్‌ని టచ్ చేయండి, బెదిరింపులకు భయపడం - స్టాలిన్‌కి అన్నమలై వార్నింగ్