G20 Summit: ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సుకు కేంద్ర సర్కారు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ దేశాల నుంచి రానున్న అగ్రనేతలకు ఆహ్వానం నుంచి బస వరకు అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు. ఒక్కొక్కరిగా దేశాధినేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందితో పహారా కాస్తుండటంతో పాటు ఇతర రక్షణాత్మక ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో పలు ఆంక్షలు విధించిన సంగతి కూడా తెలిసిందే. అలాగే ఢిల్లీని నో-ఫ్లై జోన్ గా ప్రకటించి భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. కాగా, జీ20 సదస్సు కోసం వచ్చే దేశాధినేతలకు రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా నేతలతో పాటు దేశంలోని వివిధ పార్టీల సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపించింది కేంద్ర సర్కారు. శుక్రవారం నాడు రాష్ట్రపతి ఇచ్చే జీ20 విందుకు తాను హాజరు కావడం లేదని తెలిపారు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.


జీ20 సమ్మిట్ ను పురస్కరించుకుని ఢిల్లీని నో-ఫ్లై జోన్ గా ప్రకటించారని.. మరి ఢిల్లీకి ఎలా వెళ్లాలంటూ ఛత్తీస్‌గఢ్‌ సీఎం ప్రశ్నించారు. ముందుగా షెడ్యూల్ చేసిన, జీ20 సమ్మిట్ స్పెషల్ విమానాలను మాత్రమే అనుమతిస్తామని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. సాధారణ ఏవియేషన్, నాన్ షెడ్యూల్డ్ చార్టర్డ్ విమానాలతో సహా అన్ని విమానాలు ఈ రెండు రోజులూ నిషేధించినట్లు పేర్కొంది.


శనివారం భారత మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు జీ20 ప్రముఖులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులకు భారత ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాలు పంపించింది. మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, నితీష్ కుమార్ లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విందుకు పలువురు విపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపలేదు. వీరిలో కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ మల్లిఖార్జున ఖర్గే కూడా ఉన్నారు. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందించారు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులను గౌరవించాలని అన్నారు. ఖర్గేను విందుకు ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్యంపై దాడిగా సీఎం అభివర్ణించారు.


అతిథులకు అదిరిపోయే ఆతిథ్యం


జీ20 సదస్సుకు వచ్చే అతిథులకు అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు ప్రత్యేక కార్యదర్శి ముక్తేశ్ పరదేశి తెలిపారు. స్థానిక వంటకాలతో పసందుగా విందు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు చిరు ధాన్యాలతో కూడిన భారతీయ వంటకాల రుచి చూపిస్తామని చెప్పారు. అలాగే చిరు ధాన్యాల పౌడర్ తో ఫ్రూట్ సలాడ్లు, బెల్లం రాగి ఖీర్, స్పెషల్ మిల్లెట్ థాలి, మిల్లెట్ పలావ్, మిల్లెట్ ఇండ్లీ వంటి వంటకాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రాజస్థానీ దాల్ బాటీ ఖుర్మా, పశ్చిమ బెంగాల్ రసగుల్లా, దక్షిణాది మసాలా దోశ బిహార్ లిట్టీ చోకాలనూ అతిథిలకు వండి వడ్డించబోతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే చాందినీ చౌక్ వంటకాలను కూడా తినిపిస్తామని స్పష్టం చేశారు. 


అలాగే బంగారు, వెండి పాత్రల్లో భోజనం 


భారత్ సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే సమ్మిట్‌కు ప్రపంచ స్థాయి నాయకులు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. అందు కోసం ఢిల్లీలోని హోటళ్లు ప్రత్యేకమైన రీతిలో VVIP లకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. దేశాధినేతలు, ఇతర ప్రపంచ నాయకులకు వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం అందించనున్నారు. భారతదేశం సంస్కృతి, ప్రతిబింబించేలా వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం, ఆతిథ్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అతిథులకు విలాసవంతమైన విందు కోసం వివిధ లగ్జరీ హోటళ్లలో ఈ వస్తువులను ఏర్పాటు చేశారు. అత్యంత ఆకర్షణీయమైన, అందమైన పాత్రలను ఐకానిక్ ITC తాజ్‌ హోటల్‌తో సహా 11 హోటళ్లకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం క్రోకరీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భగా పాత్రల తయారీ సంస్థ యజమానులు రాజీవ్, అతని కుమారుడు మాట్లాడుతూ.. తాము మూడు తరాలుగా ఈ పాత్రలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. విదేశీ సందర్శకులకు తమ డైనింగ్ టేబుల్‌లపై భారతదేశ రుచిని అందించడమే తమ లక్ష్యం అని చెప్పారు. ఈ పాత్రలు జైపూర్, ఉదయపూర్, వారణాసి, కర్నాటకలో కళాత్మకంగా రూపొందించినట్లు చెప్పారు.