Chandrayaan 3: భారతదేశం అరుదైన ఘనత సాధించింది. ఇండియా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం సరికొత్త మైలురాయిని చేరుకుంది. చైనాను అధిగమించి భారత్‌కు చెందిన అంతరిక్ష నౌకలు మూడు చంద్రుని చుట్టూ తిరుగుతున్నాయి.  చంద్రయాన్‌-2కు కొనసాగింపుగా చేపట్టిన చంద్రయాన్-3 జులైన 14 నింగిలోకి ఎగసింది. తాజాగా చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరంలో తిరుగుతోంది. చంద్రయాన్-3 మిషన్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్‌ను ఇస్రో విజయవంతంగా వేరు చేసింది. ఆగస్టు 23 చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగనుంది. 


విక్రమ్ ల్యాండర్‌లో రోవర్‌ ఉంటుంది. గతంలో మాదిరి చంద్రయాన్-3కి ఆర్బిటర్‌ ఉండదు. దానికి బదులుగా ప్రొపల్షన్ మాడ్యూల్ కమ్యూనికేషన్ రిలే ఉపగ్రహంగా పనిచేస్తుంది. ఇది ల్యాండర్ సందేశాలను డీకోడ్ చేసి ఇస్రోకు పంపుతుంది. వ్యోమనౌక 100-కిలోమీటర్ల చంద్ర కక్ష్యకు చేరుకునే వరకు ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్‌తోనే కాన్ఫిగర్ అయ్యి ఉంటాయి. దీనితో పాటు స్పెక్ట్రో-పోలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ పేలోడ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ పరికరం చంద్ర కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్, పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేస్తుంది. ఇది ఇతర గ్రహాల గురించి అధ్యయనం చేయడానికి  దోహద పడుతుంది. 


భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్ గుర్తుగా ల్యాండర్‌కు విక్రం పేరు పెట్టారు. దీనిని చంద్రుడిపై (భూమిపై 14 రోజులు) ఒక రోజు పనిచేసేలా రూపొందించబడింది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుని, సాఫ్ట్ ల్యాండింగ్ చేసే వరకు దాని స్వంత పనులను నిర్వహిస్తుంది. ఈ రెండూ కాకుండా, చంద్రుని చుట్టూ ఇప్పటికీ పనిచేస్తున్న చంద్రయాన్-2 చంద్రునిపై ప్రయోగంలో భారత్ స్థాయిని పెంచుతుంది. ఈ క్రాఫ్ట్, 2,379 కిలోల కక్ష్య ద్రవ్యరాశి, 1000W శక్తిని ఉత్పత్తి చేయగల సోలార్ ప్లేట్లతో తిరుగుతూ ఉంటుంది. ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్, ల్యాండర్‌తో కమ్యూనికేట్ చేస్తుంది. 


ఈ మూడు అంతరిక్ష నౌకలు అంతరిక్ష పరిశోధనలో భారతదేశం ప్రగతిని, గొప్పదనానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేయగలిగితే ఇస్రోకు చరిత్ర సృష్టించినట్లే. నాలుగు సంవత్సరాల క్రితం చంద్రయాన్-2 సాధించలేని ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాన్ని చంద్రయాన్‌-3 ప్రదర్శిస్తుంది. ఇండియా కంటే ముందుగానే చైనా, యుఎస్, కొరియా చంద్రుడిపైన ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ప్రపంచం మొత్తం ఇప్పుడు చంద్రయాన్-3 విజయవంతంపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రయోగం ద్వారా ఇండియా చంద్రుడిపై కొత్త అన్వేషణలు, శాస్త్రీయ ఆవిష్కరణలు చేయడానికి దోహదం చేయనుంది.


చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరంలో
ఈ నెల 17న గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు స్పేస్ క్రాఫ్ట్ నుంచి విక్రమ్ ల్యాండర్ సపరేషన్ జరిగింది. దీంతో చంద్రుడి చుట్టూ పరిభ్రమించడం పూర్తి అయిపోయింది. ఇకపై చంద్రుడిపై దిగే ప్రక్రియ మొదలైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విక్రమ్ ల్యాండర్ చంద్రుని గురుత్వాకర్షణ శక్తిని బట్టి క్రమంగా చంద్రుని ఉపరితలానికి దగ్గరవుతుంది. ఆగస్టు 23వ తేదీన జాబిలిపై సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. అలా స్మూత్ ల్యాండ్ అయితే చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయినట్లే.  అన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగితే చంద్రయాన్-3 విజయవంతం అవుతుంది.